పోతన భాగవతం | ధర్మనందనునితో నారద మునీంద్రుడు ఇలా ముచ్చటించాడు.. రాజా! బాలకులైన సనత్కుమారులచే శపింపబడిన వైకుంఠ ద్వారపాలకులైన జయ-విజయులు పదవీభ్రష్టులై కిందికి పడిపోతుండగా వారి పరితాపాన్ని పరికించి ఆ పుణ్యమూర్తుల మనసు ద్రవించగా ‘మీకు మూడు జన్మలలో వైరభక్తితో వైకుంఠుని సాన్నిధ్యం సంప్రాప్తమవుతుంది’ అని వారి శాపానికి విముక్తిని ప్రసాదించారు.
శాపహతులైన జయ-విజయులు ప్రథమంగా పాప (రాక్షస) యోని (జన్మలో)లో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై పుట్టారు. వారిలో కనిష్ఠుడైన కనకా (హిరణ్యా)క్షుడు కాశ్యపి (భూమి)ని చాపలాగా చుట్ట చుట్టి పట్టుకుపోతే విష్ణువు వరాహ రూపంలో వాణ్ని వధించాడు. జ్యేష్ఠుడైన కనక (హిరణ్య) కశిపుని కేశవుడు కరాళ నృసింహుడై కడతేర్చాడు. రెండవ జన్మలో వారే కైకసి (కేశిని) అనే
రాక్షసికి రావణ, కుంభకర్ణులై జన్మించగా వారిని విష్ణువు రఘువంశంలో రాఘవుడై అవతరించి తరింపజేశాడు. వాళ్లిద్దరూ తృతీయ జన్మలో మీ పినతల్లి ‘సాత్వతి’కి శిశుపాల, దంతవక్తృలుగా ఉద్భవించారు. ద్వేష రోషాదులతో జన్మించి వారు దేవదేవుని కృష్ణుని దూషిస్తూ అదే ధ్యాసతో జీవిస్తూ ఉండేవారు. అలా బండల్లాంటి వారి గుండెల్లో నిండి ఉండిన హరి పాపం పండగానే వారి శిరస్సులను సుదర్శనంతో ఖండించాడు. శాపం గడువు ప్రాపించిన (తీరిన) వారు దురాప (అందరాని, చెందలేని)మైన సారూప్య భావంతో శ్రీహరిని పొందారు.
క॥ బాలున్ హరిపద చింతా శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా
జాలున్ సంతోషింపక యేలా శిక్షించె రాక్షసేంద్రుండనఘా!
ధర్మజా! హరిద్వేషి అయిన హిరణ్యకశిపుని వరేణ్య-శ్రేష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు. శ్రీహరికి ఏకాంత-అనన్య భక్తుడు. హరిభక్తి కారణంగా హిరణ్యకశిపుని చేత పరి-పరి విధాలుగా హింసింపబడి కూడా ప్రహ్లాదుడు పురుషోత్తముని పాదపద్మాలు హృదయంలో పదిలంగా పెట్టుకొని నరహరిచే ప్రశంసితుడై పరమపదం పొందాడు. ఈ విధంగా బ్రహ్మనందనుడు నారదుడు పలుకగా ధర్మనందనుడు యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు- తాపసేంద్రా! భగవంతుడైన శ్రీహరియందు భక్తి కలవాడు, గొప్ప గుణవంతుడు, మంచి బుద్ధిమంతుడు అయిన తన పుత్రరత్నాన్ని- పసివానిని చూచి పరవశించి రక్షించక ఆ రాక్షసేంద్రుడు వానిని ఎందుకు శిక్షించాడు? మొండితనంతో దండించడానికి మెండుగా చేతులెలా వచ్చాయి? గుండె ఎలా బండబారి పోయింది?
క॥ పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్
నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్
‘మహర్షీ! నరసింహదేవుని కథలు, గాథలు జీవుల నానావిధాలైన వ్యథలను విదళించేవి (పోగొట్టేవి). భక్తి సుధా మాధుర్యాలను చిందించేవి. పారంలేని సంసార సాగరాన్ని చిలికించేవి (దాటించేవి)- జీవితానికి అమరత్వం కల్పించేవి. దేవతలకు, యక్షులకు, నాగులకు- స్త్రీ పురుష జాతులకు అందరికీ క్షేమం- రక్షణ కలిగించేవి. దేవర్షీ! ఏ సాధనతో ప్రహ్లాదుడు భక్తిలో అంత సిద్ధిని సాధించాడు? తన తనయునికి అంతటి దైవధ్యానం- తన్మయత్వం అలవడినందుకు ఆ దైత్యరాజు ఆనందించక ఎందుకు ఆందోళన చెందాడు? పొంగిపోవాల్సింది పోయి ఎందుకు కుంగిపోయాడు? మునివరా! ఈ నా సందేహాన్ని నివారించు’ అని వేడగా నారదుడు ఇలా వివరించాడు..
చ॥ వనముల నుండుఁ జొచ్చు మునివర్గములోపల, ఘోణిగాఁడు, సం
జనన మెరుంగ రెవ్వరును, జాడ యొకింతయు లేదు, తన్ను డా
సిన మరి డాయు, వెంటఁబడి చిక్కక చిక్కఁడు, వీని నొక్క కీ
లున మన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగ వచ్చునే?
హరి సూకరం (వరాహం)గా వచ్చి తన సోదరుని- హిరణ్యాక్షుని సంహరించి వాని అంతఃపుర కాంతల
(భార్యల) సౌభాగ్యాలను హరించాడని హిరణ్యకశిపుడు భరించలేని బాధను పొందాడు. రోషంతో అతని మనస్సు అగ్నిగుండమై మండసాగింది. కళ్లు నిప్పులు కక్కాయి. కనుబొమలు ముడిపడ్డాయి. సభామంటపంలో ప్రధాన దానవులను, దైత్యులను చూచి ఇలా ఘోషించాడు.. ‘వీర సహోదరులారా! ఆ ఘోణి- వరాహం (పంది)గాడు మహా మాయగాడు. వాడు ఒకచోట ఒకవిధంగా ఉండడు. నీటిలో నక్కి ఉంటాడు. అడవుల్లో దాగుతాడు. ముని సమూహాలలో మ్రుచ్చిలి ఉంటాడు. వాని పుట్టుపూర్వోత్తరాలు పట్టుమని ఎవ్వరికీ తెలియవు. ఎక్కడి వాడో, ఎవ్వడో గుట్టు తెలియదు. మనం ఎదిరిస్తే బెదరక తానూ ఎదుర్కొంటాడు. వెంటపడితే ఎప్పటికీ అలసిపోడు.
కంటపడి దొరికిపోడు. కాన, మనం కూడా ఏదో మాయోపాయం పన్ని గుట్టురట్టు చేసి పట్టుకోవాలి. మనం లోబడకుండా వానిని లోబరుచుకోగలమా? అది మనకు సాధ్యమా? తోడి శూరులారా! వాడి అయిన ఈ శూలంతో వాడి కంఠం ఖండించి ఆ వేడి నెత్తురుతో రుధిర (రక్త) ప్రియుడైన నావాడికి- తమ్ముడికి తర్పణం విడుస్తా. మీకందరికీ మేలు కలిగిస్తా. అప్పుడే నా మనస్సుకు శాంతి. దానవ శ్రేష్ఠులారా! విష్ణువంటే ఎవడో కాదు. వేరుగా ఎక్కడో లేడు. ‘యజ్ఞోవై విష్ణుః’- యజ్ఞమే విష్ణువు. విష్ణువే వేదం. అతడే వైదిక కర్మకాండకు మూలం. ధర్మానికి ఆధారం. కాన, గోవులను, విప్రులను, వేద ధర్మాలను, యజ్ఞ యాగాలను, ఆశ్రమ నియమాలను ధ్వంసం చెయ్యండి, దగ్ధం చేసిరండి.’ అని దితి పుత్రుడు హిరణ్యకశిపుడు అతిఘోరంగా అసురులకు శృతిమించి ఆదేశాలు ఇచ్చాడు. పై కంద, చంపకమాల పద్యాలు అమూలకాలు. పోతన అమాత్యుని స్వీయ (సొంత) రచనలు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి