నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ తరఫున పలువురు అభ్యర్థిత్వాన్ని ఆశించినా చివరకు అందరి ఆమోదయోగ్యంతో భగత్ పేరును ఫైనల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో పాటు మిగతా ఆశావహులతో సోమవారం సమావేశమై తుది నిర్ణయం ప్రకటించారు. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నేతలు ఎంసీ కోటిరెడ్డి, నోముల సతీమణి లక్ష్మితో కలిసి భగత్కు బీ-ఫామ్ను అందజేశారు. నాగార్జునసాగర్లో టీఆర్ఎస్కే పూర్తి సానుకూలత ఉందని, కలిసికట్టుగా భగత్ను భారీ మెజార్టీతో గెలిపించుకురావాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. మంగళవారం ఉదయం 11గంటలకు నోముల భగత్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఉమ్మడి జిల్లా
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నామని, సభలు, ర్యాలీలు ఉండబోవని స్పష్టంచేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులెవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి29(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. పార్టీ అభ్యర్థిగా నోముల భగత్కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఆశావహులైన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మరో కీలక నేత ఎంసీ కోటిరెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇందులో ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాశ్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మి కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలోనే కేసీఆర్ మిగతా ఆశావహుల ఆమోదయోగ్యంతో భగత్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సందర్భంగా పార్టీ బీ-ఫాంను, ప్రచార ఖర్చు నిమిత్తం రూ.28లక్షల చెక్కును కూడా భగత్కు కేసీఆర్ అందజేశారు.
తండ్రి నర్సింహయ్య దారిలోనే..
నోముల నర్సింహయ్య నిత్యం ప్రజలతో ఉండడంతో సీపీఎంలో అనేక ఉద్యమాల సమయంలో ఆయన వెంటే కుటుంబమంతా నడిచేది. భార్య లక్ష్మితోపాటు కుమారుడు భగత్, కూతుళ్లు కూడా ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యే వారు. పార్టీ మీటింగ్లకు హాజరవుతూ ప్రజా సమస్యలపై స్పందించే గుణంతో ఎదిగొచ్చారు. ఈ క్రమంలో నోముల నర్సింహయ్య టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ నుంచి 2014లో తొలిసారిగా బరిలోకి దిగిన సమయంలో భార్య, కుమారుడు, కూతుళ్లు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీ మీటింగ్ల్లో పాల్గొన్నారు. 2014లో ఓడిపోయినా నోముల నర్సింహయ్య నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడే ఇన్చార్జిగా పార్టీ అభివృద్ది కోసం కృషి చేశారు. ఈ క్రమంలో కుమారుడు భగత్కుమార్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ సమస్యలు, పరిష్కారాలపై పట్టును సాధించారు. ఇదే క్రమంలో 2018లో ఎన్నికల సమయంలో భగత్ నేరుగా పార్టీ క్యాడర్తో మమేకమయ్యారు. నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక కూడా భగత్ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరింతగా పెరిగింది. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా అందరి నేతలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి మరణానంతరం భగత్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గ ప్రజల్లో సానుకూల పరిణామాలు నెలకొన్నాయి.
సాగర్లో నోముల ముద్ర..
కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్దిలోనూ తనదైనశైలి కనబర్చిన నోముల న2014లో తెలంగాణ రాష్ట్ర అవిర్భావానికి ముందు టీఆర్ఎస్లో చేరారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నాగార్జునసాగర్లో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ 2018 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 1994 తర్వాత జానారెడ్డికి మరో ఓటమి రుచిచూపించిన బలహీనవర్గాల నేతగా నోముల గుర్తింపు పొందారు. దీంతో అప్పటి నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో తనముద్రతో ముందుకు సాగారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు..
ఇరిగేషన్ పరిధిలోని నాగార్జునసాగర్ పట్టణానికి మున్సిపాలిటీ హోదా కల్పించడంతోపాటు గిరిజన ప్రాంతాలతో కూడిన తిరుమగిరిసాగర్ను కొత్త మండలంగా ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సాగు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల కల్పనలోనూ నిరంతరం శ్రమించారు. అభివృద్ధిపై తపనతో అనేకమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసి నిధులు మంజూరు చేయించుకున్నారు. తన చివరి క్షణాల వరకు సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడ్డారు.
కేసీఆర్కు రుణపడి ఉంటా-నోముల భగత్కుమార్
తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కుమార్ అన్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్లో భగత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ తరఫున తనలాగే ఇతరులు కూడా టికెట్ ఆశించవచ్చు… కానీ అభ్యర్థ్ధి ఎవరనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. ఫైనల్గా తనకు కేసీఆర్ అవకాశం కల్పించారని, అందరితో కలిసికట్టుగా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తన తండ్రి చనిపోయిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు కలిసొస్తాయని తెలిపారు.
11గంటలకు భగత్ నామినేషన్
నేడు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఉదయం 11గంటలకు టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ వేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ అభ్యర్థితోపాటు ఇతరులు కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నిర్ణీత సమయంలోపే ఆర్ఓ కార్యాలయ ఆవరణలోకి వచ్చిన వారికి మాత్రమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని ఆర్వో రోహిత్సింగ్ తెలిపారు.
ఇవీ కూడా చదవండి..
81 ఏళ్ల బామ్మ.. ఇప్పుడు టిక్టాక్ స్టార్
రూ.2 కే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా?