మునుగోడు, మే 9 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. మునుగోడు మండల కేంద్రంలో గురువారం ఆయన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని మునుగోడు పెద్దచెరువులో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్భాటంగా హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారం చేపట్టాక వాటిని అటకెక్కించారన్నారు.. ఎంతో గొప్పగా చెప్పిన తులం బంగారం ఎటుపోయిందని ప్రశ్నించారు. అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా మహిళలకు రూ.2,500 ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడేందుకు, పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.