komuravelli mallanna temple | తెలంగాణలోని ఒక్కో శివాలయానిది ఒక్కో ప్రత్యేకత. వీటిలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రానిది మరింత ఘనత. చాలా ఆలయాల్లో వేప, రావి చెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం గంగరేగు చెట్టు స్థల వృక్షంగా పూజలు అందుకొంటున్నది. స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు.. భక్తులపాలిట కల్పవృక్షంగా అలరారుతున్నది.
ఏ ఆలయానికి వెళ్లినా వేప, రావి చెట్లే కనిపిస్తాయి. కానీ, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువైన మల్లికార్జునస్వామి క్షేత్రంలో మాత్రం గంగరేగు చెట్టు దర్శనమిస్తుంది. స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు వద్దే భక్తులు పట్నాలు వేసి, మొక్కులు చెల్లించుకొంటారు.
కొమురవెల్లి క్షేత్రంలో ప్రత్యేక మొక్కు.. మల్లన్న పట్నం. ఒగ్గు పూజారులు నిర్వహించే ఈ తంతు, పవిత్ర గంగరేగు చెట్టుకిందే సాగుతుంది. మల్లన్నను కొలిచే భక్తులు.. ‘కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పట్నం వేస్తాం’ అని మొక్కుకొంటారు. సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమురవెల్లికి తరలివస్తారు. ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకొంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే. కల్యాణకట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని, గంగరేగు చెట్టు మొదట్లో వేయడం ఆనవాయితీ. ఈ చెట్టుకు బంతిపూల మాల వేసి, స్వయంగా స్వామివారికే అలంకరించిన అనుభూతిని పొందుతారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని గంగరేగు చెట్టు ఎంతో మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు. ఈ చెట్టు ఆకును తింటే అనారోగ్యం దూరమవుతుందని విశ్వసిస్తారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి, అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే, వారిని మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి.. స్వామి దర్శనం చేయించడంతోపాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు.
మహాశివరాత్రి, కృష్ణాష్టమి పర్వదినాల్లో మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయవర్గాల ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దపట్నం.. అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ కార్యక్రమం కూడా గంగరేగు చెట్టు కిందే నిర్వహించడం విశేషం. ఈ సమయంలో సుమారు 80వేలకు పైగా భక్తులు కొమురవెల్లికి తరలివస్తారు. గంగరేగు చెట్టు కింద వేసే పెద్దపట్నాన్ని దర్శించుకొని తరిస్తారు. అయితే, పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం, స్థలాభావం వల్ల పస్తుతం కల్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం వేస్తున్నారు.
…✍ తుంగ పవన్ కుమార్ గౌడ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భీముని మల్లారెడ్డిపేటకు పాండవులకు సంబంధమేంటి?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
తెలంగాణలో ఉన్న బ్రహ్మంగారి మఠం గురించి తెలుసా?
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?