ఎత్తయిన కొండలు. పచ్చని వనాలు. గలగలపారే మానేరు జలాలు. పక్కనే శివకేశవ ఆలయాలు. ప్రకృతి రమణీయతతో, ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది ‘భీముని మల్లారెడ్డిపేట’. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా, భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేటది విశిష్టమైన నేపథ్యం. ఇక్కడ మానేరు నది రెండు పాయలుగా విడిపోతుంది. ఐదు వేల ఏండ్ల క్రితం ఇక్కడే ‘మాండవ్య’ మహాముని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశాడట. గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి, నిత్యం అభిషేకించేవాడట. అందుకే ఈ వాగుకు ‘మాండవ్య నది’ అన్న పేరొచ్చింది. కాలక్రమంలో ‘మానేరు’గా స్థిరపడిపోయింది.
11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చాళుక్యులు పాలించారు. ఇక్కడి విశిష్టతను తెలుసుకొని, ఒకే ప్రాంగణంలో సీతారామలక్ష్మణులతోపాటు కేశవుడి ఆలయాలను నిర్మించారు. ఆ పక్కనే శివాలయం ఉంది. ఆలయానికి ముందు భాగంలో రెండంతస్తుల్లో నిర్మించిన రాతి మండపం మరో అద్భుతం. శిల్పాకళా వైభవంతో అలరారే మండపాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. దీనిపైకి వెళ్లడానికి మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మండపం పైకి ఎక్కి చూస్తే గుట్టల మధ్యనుండి పారే మానేరు నది, అటవీ ప్రాంత అందాలు కనువిందు చేస్తాయి.
శివకేశవులు, సీతారామలక్ష్మణులతోపాటు ఇక్కడ కొలువైన తొమ్మిది అడుగుల ఆంజనేయస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన వెనకా ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూర్వం ఈ గుట్టకు సమీపంలో ఓ బ్రహ్మరాక్షసి సంచరించేదట. యజ్ఞయాగాలు చేసుకొనే రుషులకు ఇబ్బంది కలిగించేదట. ఓ రోజు శ్రీరాముడు స్థానిక పూజారికి కలలో కనిపించి, పనిపెంట గ్రామంలో ఆంజనేయుడి ఏకశిల విగ్రహం ఉన్నదనీ, దానిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పాడట. ఈ విషయాన్ని పూజారి జమీందార్ల చెవినేశాడు. ఆయన గ్రామ ప్రజలను వెంట బెట్టుకొని పనిపెంట గ్రామానికి చేరుకొన్నాడు. వీళ్ల ఎడ్లబండి ఆగిన చోట తవ్వకాలు జరిపారు. తొమ్మిది అడుగుల ఆంజనేయుడి ఏకశిలా విగ్రహం బయట పడింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి సీతారామాలయానికి ఎదురుగా ప్రతిష్ఠించి పూజలు చేయడంతో బ్రహ్మరాక్షసి పీడ విరగడైందనీ, అందరి ఆరోగ్యాలూ బాగుపడ్డాయని స్థానికులు వివరిస్తారు.
భీముని మల్లారెడ్డిపేట వాసులు ఆంజనేయుడిని భక్తితో ఆరాధిస్తారు. పిల్లలకు అంజన్న, ఆంజనేయులు, హనుమాండ్లు, మారుతి పేర్లే ఎక్కువగా పెట్టుకొంటారు. గుట్టపైన ఉన్న ఆంజనేయుడిని పూజిస్తే, ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వసిస్తారు. ఏటా పుష్య మాసంలో వచ్చే అమావాస్య నాడు ఘనంగా జాతర నిర్వహిస్తారు. హనుమాన్ జయంతితోపాటు శ్రీరామ నవమి వేడుకలనూ కన్నుల పండువగా జరిపిస్తారు. స్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి భక్తులో వస్తారు.
వనవాసంలో భాగంగా పాండవులు మాండవ్య నది ఒడ్డున కొద్దికాలం ఉన్నట్లు స్థల పురాణం చెబుతున్నది. ఆ సమయంలో ఇక్కడి గుట్టల వద్ద పాండవులు శిర్రగోనె ఆడుతుండగా శిర్ర వెళ్లి రెండు బండరాళ్ల మధ్య పడిందట. దీంతో భీముడు ఒక బండను రెండుగా చీల్చి, శిర్రను బయటకు తీశాడనీ, అందుకే ఈ గ్రామానికి ‘భీముని మల్లారెడ్డిపేట’గా పేరు వచ్చిందని ఐతిహ్యం. గుట్ట కింద సహజసిద్ధంగా ఏర్పడ్డ కోనేరు ఉంది.
✍ రాపెల్లి సంతోష్కుమార్
ఫొటోలు : కనుకుంట్ల రవికుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
తెలంగాణలో ఉన్న బ్రహ్మంగారి మఠం గురించి తెలుసా?
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?