‘ప్రభూ! నేను నీ సేవకుణ్ని’ అంటాడొకడు.
‘నేనే దేవుణ్ని’ అని అంటాడింకొకడు.
మొదటి వ్యక్తి ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ’ అనే గీతా శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ‘అన్ని ధర్మాలూ వదిలిపెట్టిన నన్నొక్కణ్నే శరణువేడు. నేను నిన్ను పాపాల నుంచి విముక్తుణ్ని చేస్తాను’ అన్నది భావం. రెండో వ్యక్తి ‘నేనే దేవుణ్ని’ అనుకుంటూ కూర్చుంటాడు. ‘దేవుడా! నాకు సాయం చెయ్యి’ అన్న దశలో అతడు లేడు. ‘దేవుడా!’ అన్నప్పుడే తాను వేరే, దేవుడు వేరే అవుతున్నారు. అక్కడ ఇద్దరున్నట్లయింది. కాబట్టి, సాయం ప్రసక్తి లేదు. భగవంతుని మీద ఆధారపడే అవకాశం లేదు. మొదటి వ్యక్తి భగవంతుని సర్వస్య శరణాగతి వేడుకున్నాడు.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహామ్యహమ్
‘అనన్యంగా నన్నెవరైతే చింతిస్తూ (స్మరిస్తూ) ఉంటారో.. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని భావం. దాన్ని అనుసరించి భగవద్రక్షణ అతనికి లభించింది. ఆ భక్తుడు మాయా పరిధిలోని వాడే అయినా.. మాయాతీతుడైన భగవంతుని శరణు పొందిన వాడు. కాబట్టి మాయ అతని మీద తన ప్రభావం చూపించలేదు.
రెండోవ్యక్తి తానే దేవుడైపోవాలని తహతహ గలిగినవాడు. పురుష ప్రయత్నమే ఆధారంగా ముందుకువెళ్తున్నవాడు. అయినా, తాను దేవుడిగా ఎప్పుడు అయిపోతాడో తనకే తెలియని అయోమయంలో పయనిస్తూ ఉన్నవాడు. ఏ క్షణంలో అయినా మాయ తన పంజా అతని మీద విసరడానికి సదా సిద్ధంగా ఉంటుంది. ఈ లోపల కరోనా వంటి ఏ ప్రకృతి వైపరీత్యమో చుట్టుముట్టి కాలరాయడానికి పూనుకొని ఉండనే ఉంటుంది. ఇది బాహ్యమైనది. అంతేకాదు, లోపలి నుంచి ఏ కామోద్రేకమో పడగవిప్పి కాటు వేసే ప్రమాదమూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో మొదటి వ్యక్తి మాత్రం సునాయాసంగా తప్పించుకోగలుగుతాడు. ఎందుకంటే.. అతనికి భగవానుని రక్షణ ఉన్నది. రెండో వ్యక్తి అమాయకత్వం వల్ల, తెలివిమాలినతనం వల్ల భగవద్రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా బయటి ఉపద్రవాల తాకిడికో, లోపలి కామక్రోధాది శత్రువుల రాపిడికో బలయ్యే ప్రమాదం ఉన్నదన్నది నిర్వివాదం.
శరణాగతుడైనవానికి ధీమా కలిగేటట్టుగా ‘నీ పాపాలన్నీ తొలగిస్తాను, నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాన’ని చెబుతూ ‘నేనే దేవుణ్ని’ అని భావిస్తూ కూర్చునేవాడికి దేవుడు అటువంటి హామీ ఇచ్చినట్లు ఎక్కడా కనిపించదు. అంతటి భగవద్గీతలోనూ ‘నమే భక్తః ప్రణశ్యతి’ (నా భక్తుడైనవాడు చెడిపోడు) అని పేర్కొన్నాడే గానీ, ‘నమే సాధకః ప్రణశ్యతి’ అని సాధకుని పరంగా హామీ ఇచ్చినట్లు చెప్పలేదు. భక్తుడంటేనే భగవంతుని భజించేవాడని, విశ్వసించేవాడని, శరణు వేడే వాడని అర్థం. భగవంతునికి భక్తుడంటే ప్రియమైనవాడని అందరికీ తెలిసినదే! అందువల్ల ‘త్వమేవ శరణం మమ’ అనేదానికి ‘అహం బ్రహ్మాస్మి’ అన్నదానికి మధ్యనున్న తేడాను సాధకులు లోతుగా కనిపెట్టవలసి ఉన్నది. దాన్ని గుర్తించి జాగ్రత్తపడవలసి ఉన్నది.
డా॥ వెలుదండ
సత్యనారాయణ
94411 62863