Priyanka Gandhi : ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ దేశంలోని వాస్తవ సమస్యలపై ఎన్నికల ప్రచారంలో మాట్లాడాలని హితవుపలికారు. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ తరఫున ప్రచారం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ ప్రకటన పాతదని, ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు చర్చిస్తున్నామని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్నది భారత్లోనా లేదంటే పాకిస్థాన్లోనా అని ప్రశ్నించారు. భారత్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్ గురించి ఎందుకు మాట్లాడాలని క్వశ్చన్ చేశారు.
ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ హిందూ ముస్లిం అంశంపై వ్యాఖ్యలు చేస్తోందని.. కానీ ప్రజలు కులం, మతం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదని ప్రియాంకా గాంధీ అన్నారు. నిరుద్యోగం రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తమకు అవసరమైన వాటిలో సగం కూడా కొనుగోలు చేయలేక పోతున్నారని చెప్పారు.
రైతులు సరైన జీవనోపాధి లేక బాధపడుతున్నారని ప్రియాంకాగాంధీ అన్నారు. డీజిల్తో పాటు వ్యవసాయానికి వినియోగించే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, బీజేపీ వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కులం, మతం పేరుతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని, కానీ కాంగ్రెస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి వాస్తవ అంశాలపై పోటీకి దిగుతోందని చెప్పారు.