Cassino | వాళ్లు ఓడిపోతారు.. ఇతడు కోటీశ్వరుడు అవుతాడు. ఇదేలా అనుకుంటున్నారా.. ఇది నిజం. గత ఏడేళ్లుగా దాదాపు రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు. పెట్టుబడి లేకుండానే ఇంత భారీ సంపాదనను సమకూర్చుకుంటున్నాడు. కేవలం అతను పందెం రాయుళ్లను ఏకం చేసి విదేశాలకు పంపడంతోనే అతడికి భారీ ఆదాయం వచ్చేస్తుంది. ఆదివారం సాయంత్రం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, నార్సింగి పోలీసులు సంయుక్తంగా చేసిన జాయింట్ అపరేషన్లో గుట్టా సుమన్ లీలలు బయటపడ్డాయి.
సుమన్ పేరు.. ఐడీని సిఫార్సుగా తీసుకువెళ్తే జూదగాళ్లు వారు ఆ క్యాసినోలో ఓడిపోయిన డబ్బు మీద అతడికి 10 నుంచి 15 శాతం వరకు కమీషన్ను క్యాసినో నిర్వాహకులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతను తీసుకువెళ్లే జూదగాళ్లు ఎంత ఓడిపోతే ఆ నగదుకు కమీషన్ లక్షలు.. కొన్ని సందర్భాల్లో కోట్లాది రూపాయలకు చేరుతుందని పోలీసుల విచారణలో బయటపడింది. అంటే ఒక గ్రూపులో వెళ్లిన వారు ఐదు కోట్లు ఓడిపోతే సుమన్కు రూ.75 లక్షలు కమీషన్ వెంటనే వస్తుంది. అదే తీసుకువెళ్లిన పందెంరాయుళ్లు గెలిస్తే సుమన్కు ఎలాంటి కమీషన్ రాదు. అంటే క్యాసినోకు వెళ్లిన వారు ఎవరు కూడా జూదంలో గెలవరని స్పష్టమవుతుంది. ఇలా సుమన్ తన రోజు వారి ఆదాయాన్ని పక్కాగా చేసుకున్నాడని విచారణలో ఆయనే స్వయంగా వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విధంగా సుమన్ గత ఏడేండ్లుగా క్యాసినో దందాను నడిపిస్తున్నట్లు తేలింది.
తాజాగా సుమన్ నవంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు కొంత మందిని రష్యాలోని సోచీ క్యాసినోకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇలా వెళ్తున్న వారందరినీ పోగుచేసి ఆదివారం వారికి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల వద్ద తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యువ హీరో తండ్రి రవీంద్ర ప్రసాద్ లీజ్ కింద తీసుకున్న ఫాంహౌస్లో గెట్ టుగెదర్ పెట్టాడు. ఈ సందర్భంగా వారికి మద్యంతో పాటు మూడు ముక్కల ఆటను నిర్వహించారు. అయితే ఈ ఆటలో దాదాపు 100 మంది పాల్గొనాల్సి ఉండగా పోలీసు సోదాలు జరిపినప్పుడు 30 మంది దొరికిపోయారు. అయితే ఆదివారం రోజు దాదాపు కోటి రూపాయల జూదం ఆడేందుకు ప్లాన్ చేసినట్లు స్పష్టమైంది.
సుమన్ తీసుకువెళ్లే విదేశీ క్యాసినోలో జూదం మూడు రోజుల పాటే ఉంటుంది. దీని కోసం క్యాసినో నిర్వాహకులు వీసాలతో పాటు రానుపోను విమానం ప్రయాణ టికెట్లు , అక్కడ బస ఏర్పాట్లు చేస్తారు. బస చేసే హోటల్ నుంచి వారిని క్యాసినోకు నిర్వాహకులు ప్రత్యేక ఖరీదైన కార్లను పంపించి సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తారు. ఈవిధంగా సుమన్ కనీసం ప్రతి ట్రిప్పులో కనీసం 50 మందిని తీసుకువెళ్తాడని తెలిసింది.
ఆదివారం ఫాంహౌస్లో అదుపులోకి తీసుకున్న 30 మందిని సోమవారం అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు. అరస్టైన వారిలో ప్రముఖులు ఉండగా మహబూబాబాద్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన నిర్వాహకుడు గుట్టా సుమన్తో పాటు మారెడు తరుణ్, వీర్ల శ్రీకాంత్, గుమ్మడి రామస్వామి చౌదరి, నందిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాస్రావు, టి.శివరామకృష్ణ, బడిగ సుబ్రహ్మాణ్యం, పండిటాపు సురేశ్, నాగార్జున, కౌతారపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమలరావు, మద్దుల ప్రకాశ్, సీవీఎస్ రాజారాం, కె.మల్లికార్జున్రెడ్డి, బొగ్గారపు నాగరాజు, గట్టు వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్రావు, బి.రమేశ్, కె.శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోల ఆదిత్య, సీహెచ్ గణేశ్, శ్రీరాం భద్రయ్య, తోట ఆనంద్ కిశోర్, షేక్ ఖాదర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.6.77 లక్షల నగదు, 33 మొబైల్ ఫోన్లు, మూడు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన గుట్టా సుమన్కు చాలా మంది బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. అందులో చాలా మందికి విదేశాల్లోని క్యాసినోలలో జూదం ఆడాలనే కోరిక ఉన్న విషయాన్ని పసిగట్టాడు. దీంతో వీరందరి కోరికను తీర్చేందుకు సుమన్ ఓ పథకం వేశాడు. దీని కోసం కొన్ని రోజుల పాటు సుమన్ మరికొంత మందితో కలిసి శ్రీలంక, రష్యా, దుబాయ్, మకావ్(చైనా)లోని పేరొందిన క్యాసినో క్లబ్లకు వెళ్లాడు. అక్కడ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని వారికి సన్నిహితంగా మారాడు. తర్వాత వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సుమన్ పేరు.. ఐడీతో ఎవరు ఆ క్యాసినోకు వెళ్లినా.. వారికి ప్రత్యేక డిస్కౌంట్తో ఎంట్రీ ఉంటుంది. అదే సాధారణంగా వెళ్తే.. ఆ ఎంట్రీ మూడింతలు పెరుగుతుంది. ఇలా సుమన్ నాలుగు దేశాల్లోని క్యాసినో క్లబ్లలో కీలకంగా మారాడు. అలా సుమన్ విదేశాల్లో గ్యాంబ్లింగ్ ఆడాలనే వారికి నమ్మకం కుదిర్చాడు. ఆ దేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూదం ఆడే విధంగా ఏర్పాట్లను సమకూర్చి మరింత సన్నిహితుడిగా మారాడు. ఇలా సుమన్ తన గ్రూపులో 500 మంది ప్రముఖులను సభ్యులుగా చేర్చుకున్నట్లు సమాచారం.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ప్రధాన నిర్వాహకుడు సుమన్ ఫోన్తోపాటు అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సుమన్తో కలిసి చాలాసార్లు విదేశాలకు వెళ్లి క్యాసినోలో జూదం ఆడి వచ్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలిసింది. కేసు విచారణ నేపథ్యంలో సుమన్తో ఇటీవల జరిపిన కాల్స్తోపాటు వారు విదేశాలకు వెళ్లిన వీసాలపై కూడా దృష్టి సారిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి అవసరమైతే నోటీసులు జారీ చేస్తామని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Playing poker | టాలీవుడ్ నటుడి ఫాంహౌజ్లో పేకాట.. 30 మంది అరెస్ట్
స్నేహితుడి వక్రబుద్ధి : లిఫ్ట్ ఇస్తానని చెప్పి యువతిని తుపాకీతో బెదిరించి..ఆపై లైంగిక దాడి!
అన్నీ వదిలేసి.. ఆ వైన్ బాటిళ్లనే ఎత్తుకెళ్లారు.. ఎందుకో తెలుసా!
Man Kills Friend | కోరిక తీర్చలేదని స్నేహితుడి తలపగలగొట్టి చంపిన యువకుడు!