Tollywood | ఎంతకాలమని చేస్తామీ యాక్షన్ సినిమాలు.. ఫైట్స్ చేసి చేసి బోర్ కొడుతుంది.. రొటీన్ కథలు విని విని చిరాకు వస్తుంది.. హాయిగా నవ్విస్తే ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అనుకుంటున్నారు మన యంగ్ హీరోలు. అందుకే అందరి చూపు ఎంటర్టైన్మెంట్ వైపు వెళుతుంది. ఒకరో ఇద్దరో కాదు సీరియస్ ఇమేజ్ ఉన్న ప్రతి హీరో కూడా తన మార్క్ మార్చుకోవాలని చూస్తున్నాడు. చాలా రోజులుగా సెన్సిటివ్ సినిమాలు చేస్తున్న హీరోలు కూడా ఇప్పుడు పూర్తిగా కామెడీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన హీరో శ్రీ విష్ణు. కెరీర్ మొదటి నుంచి కూడా ఈయన చేసే సినిమాలన్నీ ఒకే పంథాలో ఉంటాయి. చాలా సీరియస్ డ్రామాలు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసినా కూడా.. శ్రీ విష్ణు అంటే మనకు గుర్తొచ్చే ఇమేజ్ వేరు. అలాంటి హీరో ఇప్పుడు సామజవరగమన అంటూ కడుపులు చెక్కలు అయిపోయే సినిమా చేశాడు.
సీరియస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే సత్యదేవ్.. ఫుల్ బాటిల్ అంటూ ఫుల్ పటాస్ లాంటి సినిమాతో వస్తున్నాడు. గతంలో తిమ్మరుసు సినిమా చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకుడు. ఇక నాగశౌర్య కూడా ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని వచ్చేస్తున్నాడు. ఈయన లేటెస్ట్ సినిమా రంగబలి పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్. అందులోనే మాస్ మసాలా కమర్షియల్ అంశాలన్నీ బాగా దట్టించి తీసుకొస్తున్నాడు దర్శకుడు.
మత్తు వదలరా, తెల్లవారితే గురువారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి.. భాగ్ సాలె అంటూ డార్క్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. జూలై 7న రంగబలి, భాగ్ సాలే సినిమాలు విడుదల కానున్నాయి. వీళ్లంతా నిన్న మొన్నటి వరకు సీరియస్ సినిమాలు చేసిన వాళ్లే. కానీ ఇప్పుడు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వైపు వచ్చేస్తున్నారు. నవ్విస్తే తప్ప విజయం రాదు అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అందుకే కామెడీ కామెడీ అంటున్నారు. మరి వీళ్ళు తీసుకున్న ఈ యూటర్న్ వాళ్లకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
Ramcharan | రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాపై ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.. షూటింగ్ ఎప్పుడంటే..!