Ramayanam | ఇప్పుడు దేశమంతటా రామాయణం గురించే చర్చ జరుగుతోంది! ఆదిపురుష్ విడుదల తర్వాత దర్శకుడు ఓం రౌత్ను అందరూ తిట్టిపోస్తున్నారు. అసలు రామాయణం తెలుసా.. డబ్బుల కోసం ఏది పడితే అదే తీస్తావా అంటూ డైరెక్టర్ను దుమ్మెత్తిపోస్తున్నారు. రామ కథ తెలియకపోతే రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్ చూసి బుద్ధి తెచ్చుకో అంటూ మండిపడుతున్నారు. ఇతిహాసాలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి తరుణంలో ఆ సీరియల్ను మరోసారి టెలికాస్ట్ చేసి రామాయణం విశిష్టతను తెలియజేయాలని చాలామంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే రామానంద్సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో ప్రముఖ టీవీ ఛానెల్ షెమారూ కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణం సీరియల్ను రీటెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది.
జూలై 3వ తేదీ నుంచి రామాయణం సీరియల్ను రీ టెలికాస్ట్ చేస్తున్నామని షెమారూ టీవీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. ఈ మేరకు ఓ టీజర్ను కూడా వదిలింది. సోమవారం నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 గంటల సమయంలో ఈ సీరియల్ను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ సీరియల్ తొలిసారిగా దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యింది. 1987 జనవరి 25 నుంచి 1988 జూలై 31వ తేదీ వరకు ప్రతిరోజు ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఇది టెలికాస్ట్ అయ్యింది. అప్పట్లో ఈ ధారావాహిక చాలా సక్సెస్ అయ్యింది. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సీరియల్గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. ఎన్నో ఏండ్ల పాటు ఈ సీరియల్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ను కరోనా సమయంలో రీటెలికాస్ట్ చేశారు. 2020 మార్చి 28వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం టెలికాస్ట్ చేశారు. అప్పుడు కూడా ఈ సీరియల్ను 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు ఆదిపురుష్ వివాదం తర్వాత రెండోసారి రీటెలికాస్ట్కు సిద్ధమైంది.