కమిషనరేట్ పరిధిలో 15 చెక్పోస్టులు
ఇప్పటి వరకు 500 కేసులు నమోదు
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
హన్మకొండ సిటీ, మే 13 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి తెలిపారు. గురువారం నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుబేదారి పీఎస్ పరిధిలోని అదాలత్ జంక్షన్లో కొద్దిసేపు వాహనాల తనిఖీల్లో స్వయంగా పాల్గొని, రోడ్లపైకి వచ్చే వాహనదారులపై అసహనం వ్యక్తం చేశారు. వాహనదారులకు జరిమానా విధించాలని స్థానిక పొలీసులను ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయవద్దన్నారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసేందుకు కమిషనరేట్ పరిధిలో 15 చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన 500 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వ్యక్తులు ఈ-పాస్ పొందాలని, అలాగే, అత్యవసర సేవలతో పాటు నిత్యావసర వస్తువులు రవాణా చేసేందుకు పోలీసు పాస్లను పొందాల్సిన అవసరం ఉందన్నారు. వివాహ వేడుకలు చేసుకునేవారు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి, అనుమతులు తీసుకోవాలన్నారు.