మహబూబ్నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఊరేగింపులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జడ్చర్లలో విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఊరేగింపులకు అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. ర్యాలీల నిషేధంపై ప్రజలకు ముందస్తుగా ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు.
ఈ విషయంలో చట్టవిరుద్దంగా ప్రవర్తించేవారిపై జాతీయ విపత్తు చట్టం, ఎన్నికల నియమావళి చట్టం మేరకు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలను ఉల్లంఘించేవారిపై నిఘా పెట్టడానికిగానూ వీడియో కెమెరాలతో పాటుగా నిఘా బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు.