అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి, మే 26 : గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని బరువు, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమశాఖ అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను సరఫరా చేయాలని అదనపు కలెక్టర్కు గ్యాస్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గర్భిణిగా ఉన్నపుడు కడుపులోని బిడ్డ ఆరోగ్యం, స్పందనపై సకాలంలో ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. అందుకోసం పటాన్చెరుకు చెందిన ఆర్జీఏ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సదాశివపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలకు సరఫరా చేసేందుకు 75 సరుకుల కిట్లను అందజేశారని తెలిపారు. సరుకులలో కందిపప్పు-3 కిలోలు, నూనె-3 లీటర్లు, గోధుమపిండి-5కిలోలు, చక్కెర- 2 కిలోల చొప్పున గర్భిణులకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జీఏ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు అభినవ్, ఏసప్ప, డీసీపీవో రత్నం తదితరులు పాల్గొన్నారు.