గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఓ సినిమా గురించి ఎదురు చూస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎలా అయిన ఈ ఏడాది విడుదల చేయనున్నారు. సినిమా షూటింగ్కి సంబంధించి చివరి షెడ్యూల్ మిగిలి ఉండగా, ఆ షెడ్యూల్ లో కీలకమైన రెండు పాటలతో పాటు ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.
దాదాపుగా 8 నుండి 10 వారాల పాటు కంటిన్యూ షెడ్యూల్ తో సినిమాను ముగించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షూటింగ్స్ మొదలు కాగా, ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొద్ది మంది క్రౌడ్ తో షూటింగ్ ప్రారంభించాలని జక్కన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టాడట. జులై మొదటి వారంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ సినిమాలోని ఒక ఫైట్ కంటతడి పెట్టిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.