ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సాయికుమార్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ చనిపోవడం సంచలనంగా మారింది. అధికారుల వేధింపులా? పని ఒత్తిడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫోన్ డేటా డిలీట్ అయిందంటూ..బంధువులు ఆరోపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే సూసైడ్ నోట్ ఉందా? లేదా? అనే విషయంపై కూడా పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం వినిపించాయి. సాయికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం.. పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయం ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.
విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ తన కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు అధికారుల వేధింపులా ? పని ఒత్తిడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ డేటా డిలీట్ అయినట్లు ఆరోపణలు, సూసైడ్ నోట్ ఉందా? లేదా? అనే విషయంపై పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం విన్పించాయి. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన సాయికుమార్ మృతిపై కుటుంబ సభ్యు లు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం, పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)
సాయికుమార్ ఆత్మహత్య చేసుకోలేదని, సంఘటన స్థలంలో రక్తం మరకలున్నాయని, కుటుంబ సభ్యులు వచ్చేవరకు మృతదేహాన్ని ఎందుకు ఉంచలేదు, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తీసికెళ్లినా అక్కడ మృతి చెందిన విషయం నిర్ధారణ అయిన తరువాత కూ డా కుటుంబ సభ్యులు వచ్చే వరకు అక్కడే మృతదేహాన్ని ఎందుకు ఉంచలేదు అనే విషయంపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తెల్లవారుజాము న సుమారు 2గంటల ప్రాంతంలో ఈ విష యం వెలుగులోకి రాగా స్థానికంగా ఉన్న అధికారులకు కూడా సమాచారం లేదని, ఉదయం 6గంటల ప్రాంతంలోనే అధికారులకు సమాచారం అందిందని తెలిసింది.ఈ విషయాన్ని తాను ఇన్చార్జీగా ఉన్న సమయంలో జరిగినా ఈ ఘటనపై తనకు 6గంటలకు సమాచారం ఇచ్చారంటూ తోటి సిబ్బంది వద్ద సదరు అధికారి వాపోయాడనే విష యం పోలీసువర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మృతుడి ఫోన్ డేటా డిలీట్ అయ్యిందంటూ బంధువులు ఆరోపిస్తుండడంతో, ఈ ఫోన్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఫోన్ విషయంలో ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయి, అధికారులు ఈ విషయంపై ఎందుకు స్పందించ డం లేదు అనే అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అన్ని కేసులలో ఫోన్ అనేది కీలకంగా మారింది. సూసైడ్ నోట్ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే సూసైడ్ నోట్ ఉన్నట్లు ఎక్కడ కూడా స్పష్టత లేదు. అధికారులు ఎవరు కూడా ఈ విషయాన్ని నిర్ధరించలేదు. అయితే ఫోన్లో ఏమైనా సూసైడ్కు సంబంధించిన సమాచారం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసు అధికారులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉండగా, ఎవరు కూడా స్పందించకపోవడంతో ఆయా ఆరోపణలలో నిజా నిజాలు బయటపడాల్సిన అవసరముందంటూ పోలీస్ శాఖలో సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారు, ఎందుకు పనిచేయడం లేదు, ఎప్పటి నుంచి పనిచేయడం లేదనే అనుమానాలు కల్గుతున్నాయి. పోలీసులపై వస్తున్న ఆరోపణలన్నింటిని పటాపంచాలు చేసేందుకు సీసీ కెమెరాలు సమాధానం చెప్పేవి కాని, ఆ సీసీ కెమెరాలే పనిచేయకపోవడంతో ఏదీ నిజం, ఏదీ అబద్దం అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉంటాయనే వాదనను కొందరుకొందరు సిబ్బంది విన్పిస్తున్నారు.
మృతి చెందిన కానిస్టేబుల్ ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపన పడేవాడు. ఈ నేపధ్యంలోనే పోటీ పరీక్షలకు కూడా సిద్దమవుతున్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్స్టేషన్తో పాటు ఏసీపీ కార్యాలయంలో విధులు కేటాయిస్తూ పని ఒత్తిడిని పెంచారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేవలం డీఎస్ఆర్ విధులు నిర్వహించే పనులే చేస్తున్నాడని అధికారులు చెబుతున్నా మృతుడి బంధువులు, కుటుం బ సభ్యులు మాత్రం అది వాస్తవం కాదంటూ పేర్కొంటున్నారు. కంప్యూటర్పై అవగాహన ఉండడంతో కార్యాలయంలోని విధులకే పరిమితం చేశారని, బయట విధులకు వెళ్తానన్నా అధికారులు ఆ విధులను కేటాయించలేదని ఇది కూడా మానసిక ఆందోళనకు కారణమై ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. కానిస్టేబుల్ వ్యక్తిగత కారణాలతో ఆందోళనలో ఉంటే తాను ఇంటి వద్దనో, కార్యాలయానికి బయట ఇతర ప్రాంతాలలోనే ఆత్మహత్యకు పాల్పడేవాడని, తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటే ఎదో బలమైన కారణం ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.