స్వాతిముత్యం (Swathimuthyam) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh). సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్కు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. దసరా సందర్భంగా కుటుంబసమేతంగా వచ్చి చూసేలా సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలిసిపోతుంది.
అక్టోబర్ 5న సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొంటుంది టీం. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు గణేశ్. నా సోదరుడు కమర్షియల్ మూవీస్ చేస్తున్నప్పటి నుంచి..నా సొంత మార్క్ ఉండేలా సినిమాలు చేయాలనుకున్నా. కొత్తదనంతో ఉన్న కథలు ఎంచుకుంటున్నానన్నాడు.
సినిమాలో హీరో పాత్ర చాలా అమాయకంగా కనిపించే మంచి మనస్సున్న వ్యక్తిత్వంతో సాగుతుంది. మనం సాధారణంగా అమాయకంగా కనిపించే వ్యక్తిని స్వాతిముత్యం అంటాం. ఇది జనాలకు చాలా సులభంగా కనెక్ట్ అవుతుందనుకున్నామని చెప్పుకొచ్చాడు.
తాను మొదటిసారి సినిమా సెట్స్కు వెళ్లినపుడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు గణేశ్. నేను 6 ఏళ్ల వయస్సున్నపుడు మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న ఆది మూవీ సెట్స్కు వెళ్లాను. పాటలు ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. వాచ్లో సమయాన్ని ఎలా చదవాలో నేర్పేందుకు ఎన్టీఆర్ నా నుండి, అన్నయ్య నుండి 10 డాలర్లు వసూలు చేశాడంటూ గణేశ్ గుర్తు చేసుకున్నాడు.