నారాయణపేట టౌన్, జూన్ 10 : జిల్లాలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. కొవిడ్ నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. 10 రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే క్రమంగా తగ్గుదల కనిపిస్తున్నది. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆంక్షలు, ఫీవర్ సర్వే, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలలో అవగాహన పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియతో కరోనా పాజిటివ్ రేటులో తగ్గుదల కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండేది. ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన వారు ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా తిరిగి సొంత గ్రామాలకు రావడం, జిల్లా కర్ణాటక రాష్ర్టానికి సరిహద్దున ఉండడం వల్ల పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు సరిహద్దున ఉన్న మద్దూర్, దామరగిద్ద, కోస్గి, కృష్ణ తదితర మండలాల్లో పాజిటివ్ రేటు ఎక్కువగా నమోదయింది.
అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్, ఫీవర్ సర్వేతోపాటు అధికారులు తీసుకుంటున్న చర్యలతో మే చివరి వారంలో, జూన్ మొదటి వారం నుంచి కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నది. పరీక్షల సంఖ్య పెంచినా పాజిటివ్ కేసుల నమోదు మాత్రం పెరుగలేదు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లకే పరిమితం కావడం, మాస్కు లు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఇతర కొవిడ్ నిబంధనలు పాటించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెల 29 నుంచి ఈ నెల 7 వరకు 6,922 మందికి పరీక్షలు నిర్వహించగా 366 మందికి పాజిటివ్ నిర్ధారణ వచ్చింది.
లాక్డౌన్తో సత్ఫలితాలు
కరోనాను కట్టడి చేసేందుకు గానూ ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్, ఫీవర్ సర్వే సత్ఫలితాలు ఇచ్చాయి. ఎస్పీ చేతన ఆదేశాల మేరకు లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తూ కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన సమయంలో ప్రజలు తమ కార్యకలాపాలు జరుపుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులపై జరిమానాలు విధించడంతోపాటు సీజ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఎస్పీ చేతన ఎప్పటికప్పుడు జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కొనసాగుతున్న ఇంటింటి సర్వే
కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకుగానూ ప్రభుత్వం ఫీవర్ సర్వే చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ఉంటూ ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. ఆయా బృందాలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లాలో మొదటి విడుత ఇంటింటి సర్వే మే 5వ తేదీ వరకు పూర్తి కాగా ప్రస్తుతం రెండో విడుత కొనసాగుతున్నది. మొదటి విడుత సర్వే చేసేందుకు జిల్లాలో 592 బృందాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడుత ఇంటింటి సర్వేలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 515 బృందాలు, 3 మున్సిపాలిటీల్లో 77 సర్వే బృందాలు పాల్గొని మొత్తం 11, 41,397 గృహాలను సందర్శించాయి. గ్రామీణ ప్రాంతాల్లో 8,753మంది కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నవారిని, మున్సిపాలిటీల్లో స్వల్ప లక్షణాలు ఉన్న 367 మందిని గుర్తించి వారికి కిట్లు అందజేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండో విడుత ఫీవర్ సర్వేలో మొత్తం 592 బృందాలు పాల్గొంటున్నాయి. ఇంతవరకు 3 మున్సిపాలిటీల్లో 27,774 గృహాలను సందర్శించి 261 మందికి కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1,13,623 గృహాల్లో ఇంటింటి సర్వే చేపట్టి 1,058 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు అందజేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి ఇంటి వద్ద మందులు అందజేసి, హోం ఐసొలేషన్లో ఉండాలని చెబుతూ పలు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. ఇంటి వద్ద వసతి లేని వారికి కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.