బాలీవుడ్ (Bollywood) యాక్టర్ అజయ్ దేవ్గన్, కన్నడ యాక్టర్ సుదీప్ నడుస్తున్న ట్విటర్ వార్ దేశమంతా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పాపులర్ సింగర్ సోనూ నిగమ్ (Sonu Nigam) స్పందించాడు. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, దీన్ని హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై రుద్దలేమని..హిందీ భాషను “రాజ్యాంగంలో జాతీయ భాష”గా పేర్కొనలేదని అన్నాడు.
‘నాకున్న జ్ఞానం ప్రకారం భారత రాజ్యాంగంలో హిందీ జాతీయ భాషగా రాయబడలేదు. దీనిపై నిపుణులను కూడా సంప్రదించా. దేశంలో అత్యధికమంది మాట్లాడే భాష హిందీ అని నాకు అర్థమైంది. ప్రపంచం మొత్తంలో అత్యంత పురాతనమైన భాష తమిళం (Tamil) అని ప్రజలు చెబుతారని సోనూ అన్నారు. దేశంలో మనకు కొత్తగా కావాల్సిన సమస్యలు తక్కువగా ఉన్నాయా..? నువ్వు తమిళుడివి, నువ్వు హిందీ మాట్లాడాలి..అంటూ ఇతరులపై భాషను రుద్దుతూ దేశంలో అనైక్యత సృష్టిస్తున్నాం..ఎందుకు?
ప్రజలకు వారు మాట్లాడాలనుకుంటున్న భాషను నిర్ణయించే హక్కు ఉండాలని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు’ సోనూ నిగమ్. ఈ దేశంలో ప్రజలను భాష పేరుతో మరింత విభజించవద్దని కోరాడు సోనూనిగమ్. మన కోర్టుల్లో కూడా తీర్పులు ఇంగ్లీషులోనే ఉంటాయని..విమాన సిబ్బంది కూడా ఆంగ్ల భాషకే ప్రాధాన్యం ఇస్తున్నారని సోనూ చెప్పారు. తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు హిందీలో సమాధానం ఇచ్చినప్పటికీ క్యాబిన్ సిబ్బంది ఇంగ్లీషులో మాట్లాడిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.