అత్యుత్తమ పోషకాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కీర దోస కామారెడ్డి జిల్లాలో పుష్కలంగా సాగవుతున్నది. అంతేగాకుండా ఇక్కడి నుంచి పలు దేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. కేవలం మూడు నెలల వ్యవధిలో చేతికి వచ్చే ఈ పంటతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న కీర దోసను జహీరాబాద్ ప్రాంతంలోని ఓ కంపెనీకి తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేసిన తరువాత జపాన్, ఆస్ట్రేలియాతో పాటు అమెరికాకు పంపిస్తున్నారు. ఆరుతడి పంటగా సాగు చేసే ఈ పంటతో రైతులకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే సుమారు రూ.70 వేల నుంచి రూ. 80 వేల ఆదాయం వస్తోంది. కేవలం ఎకరానికే ఇంతలాభం వస్తుండడంతో రైతులు ఆసక్తిగా సాగు చేస్తున్నారు. పంట వేసిన నెల రోజుల నుంచి ప్రతిరోజూ పనిఉంటుంది.ఈ పంటను ఎక్కువగా గిరిజన గ్రామాల్లో సాగుచేస్తున్నారు.
ముక్కలుగా చేసి విదేశాలకు ఎగుమతి
ఆరోగ్య పోషణలో మంచి ఆహారంగా పేరున్న కీర దోసను జహీరాబాద్ సమీపంలో ఉన్న ఓ కంపెనీ పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన కీర దోసను అక్కడ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తారు. కొద్దిగా పెద్ద సైజులో ఉన్న వాటిని ముక్కలుగా చేసి ప్యాకింగ్ చేస్తారు. తరువాత వాటిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నాగిరెడ్డి పేట మండలం నుంచి ప్రతిరోజూ కనీసం 20 టన్నుల కీర దోసను కంపెనీకి తీసుకెళ్తున్నారు.
మూడు నెలల సాగు,ఎకరానికి రూ. లక్ష ఆదాయం
కీర దోస పంటను ముఖ్యంగా యాసంగి సీజన్లో మాత్రమే సాగు చేస్తున్నారు. డిసెంబర్లో కీర దోస పంటను వేస్తారు. పంటను వేసిన 40 రోజుల నుంచి కాత ప్రారంభమవుతుంది. దోస కాయ ప్రారంభం నుంచి ప్రతిరోజూ వాటిని తెంపడం రైతులకు పెద్ద పని. కాయ చిన్నగా ఉన్నప్పుడు తెంపడంతో రైతుకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. చిన్న సైజుకు కిలోకు రూ.22, మధ్యస్తంగా ఉండే వాటికి రూ.14, మరింత పెద్దగా ఉండే వాటికి కిలోకు కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తారు. పంట వేయడానికి అవసరమైన విత్తనాలతో పాటు వాటికి పిచికారీ చేయాల్సిన వివిధ రకాల మందులను కంపెనీ వారే పంపిణీ చేస్తారు. కాయ ఎక్కువగా రావడానికి, పురుగులు పట్టకుండా ఉండడానికి అవసరమైన మందులను అదే కంపెనీ రైతులకు అందించడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తుంది. పంటను సైతం కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షిస్తుంటారు.
మంచి లాభం వస్తుంది..
ఒక ఎకరంలో కీర పంట వేశాను. ప్రతిరోజూ పని ఉంటది. లాభం బాగానే ఉంటున్నది. రెండున్నరేండ్లుగా కీర దోస వేస్తున్నాను. మూడు నెలల్లో పంట సాగు చేస్తే రూ.70 వేల వరకు లాభం వస్తున్నది.
-రమావత్ లక్ష్మి, మహిళా రైతు, జప్తి జానకంపల్లి
ఎకరానికి లక్ష వస్తున్నది..
ఎకరం భూమిలో సుమారు లక్ష రూపాయల పంట వస్తుంది. మూడు నెలల్లో పంట పూర్తిగా వచ్చేస్తది. మంచి లాభం ఉందని నాలుగేండ్లుగా సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు కంపెనీ వారే విత్తనాలు ఇచ్చారు. అవసరమైన మందులు కూడా వారే ఇస్తున్నారు.
-ఆర్. రవీందర్, రైతు, మెల్లకుంటతండా
ఇవీ కూడా చదవండి..
వ్యాక్సిన్ల రవాణాపై రియల్ టైమ్ పర్యవేక్షణ