ఇప్పటికే పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాల పంపిణీ
3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాల బోధన
జిల్లా వ్యాప్తంగా 1607 వాట్సాప్ గ్రూపుల నిర్వహణ
దూరదర్శన్, టీశాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా రివిజన్ పాఠాలు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 3 : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పాఠశాలలు రెండో సారి మూతపడ్డాయి. విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విద్యా విధానాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసింది. నిపుణులైన ఉపాధ్యాయులతో నిత్యం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పాఠ్యాంశాల్లో సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలను ఉపాధ్యాయులకు ఫోన్ చేసి విద్యార్థులు తెలుసుకుంటున్నారు. ఆన్లైన్ పాఠాలను రివిజన్ చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులు ప్రతి రోజూ ఎంత మంది ఆన్లైన్ పాఠాలు వింటున్నారు లేరా అన్న విషయాలను ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలను ప్రధానోపాధ్యాయులు అందజేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 756 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 533, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, ఉన్నత పాఠశాలలు 117, కేజీబీవీలు 18, టీఎస్ఆర్ఈఐఎస్ 1, మోడల్ స్కూల్ 1, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ 1 పాఠశాలలో మొత్తం 53,751 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 3 నుంచి పదోతరగతి వరకు 39915 మంది విద్యార్థులున్నారు. ఇందులో డీడీ, టీశాట్ ద్వారా రోజూ 22,537 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ ద్వారా 3812 మంది విద్యార్థులు వింటున్నారు. 1503 మంది విద్యార్థులకు ఏ పరికరాలూ లేవు.
దూరదర్శన్, టీశాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా రివిజన్ పాఠాలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే ఆన్లైన్ పాఠాలను దూరదర్శన్, టీ-శాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ప్రతి రోజూ ఆన్లైన్లో వచ్చే పాఠ్యాంశాల టైమ్ టేబుల్కు విద్యార్థులకు ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో పంపించడంతో మరుసటి రోజు పాఠ్యాంశాల వివరాలను ఆన్లైన్లో వింటున్నారు.
నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణ
విద్యార్థుల చదువుల దృష్ట్యా ఆన్లైన్లో అందించే పాఠ్యాంశాలను ప్రతి విద్యార్థీ వింటున్నారా? లేదా ? అని తెలుసుకునేందుకు ప్రతి రోజూ ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. 2031 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో వివరాలను డీఈవో ప్రణీత ఆరాతీస్తున్నారు. పాఠశాలల వారీగా వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి ఒక్కో తరగతికి ఒక్కో టీచర్ను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1607 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చూడండి..
ఉత్తరాఖండ్లో జర్నలిస్టులందరికీ కరోనా టీకా
గాయమైన కాలును మమత ఊపుతున్న వీడియో వైరల్