కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయమైన కాలును ఊపుతున్న వీడియో వైరల్ అయ్యింది. పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా గాయమైన కాలును ఆమె పలుమార్లు కదిలించారు. దీనిని ఎవరో తమ మొబైల్లో వీడియో తీశారు. కాగా, సినీ నిర్మాత అశోక్ పండిత్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మమతా బెనర్జీ విరిగిన కాలు డ్యాన్స్ చేయాలనుకుంటున్నది’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు ఈ వీడియోను సామాజిక మాద్యమాల్లో వైరల్ చేశారు. మమత ఇకనైనా కాలికి గాయం నాటకం ఆపాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రణయ్ రాయ్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం ఆమె ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ కాలికి వ్యాయామం కోసం మమత అలా చేసి ఉంటే మంచిదేనని, దీనికి బదులు నడిస్తే ఇంకా త్వరగా కొలుకునే అవకాశమున్నదని అన్నారు.
బీజేపీ నేతల వ్యాఖ్యలను టీఎంసీ నేతలు ఖండించారు. వారు రాష్ట్ర సీఎంతోపాటు ఒక మహిళను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మమతకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా ఆమె కాలి గాయంపై అబద్ధాలు చెబుతారా అని టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పే సామర్థ్యం బీజేపీ నేతలకు మాత్రమే ఉన్నదని ఆయన దుయ్యబట్టారు.