(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి వివాదంలో చిక్కుకొన్నారు. 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలై అనర్హులుగా మిగిలిన సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి రూ. కోట్లు తీసుకొన్న దొడ్డమణి వారికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినట్టు బీజేపీ నేత ఎన్నార్ రమేశ్ ఆరోపించారు. ఇందుకుగానూ జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐకి, కర్ణాటక లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. రూ. 800 కోట్ల విలువ గల ఈ కుంభకోణంలో దొడ్డమణితో పాటు మరో ఐదుగురికి సంబంధం ఉన్నట్టు ఆరోపించారు.
ఫిర్యాదు చేసినా.. చర్యలు లేవు : బీజేపీ నేత ఎన్నార్ రమేశ్
సంపన్న కుటుంబాలకు చెందిన అనర్హులైన పిల్లల నుంచి రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల చొప్పున వసూలు చేసి తాను మేనేజ్మెంట్ కమిటీ చీఫ్గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో, డెంటల్ కాలేజీలో దొడ్డమణి ప్రవేశాలు కల్పించారు. దీనికోసం ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారు. ఈ అక్రమాలపై అసోషియేషన్ మెంబర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కుంభకోణం విలువ రూ. 800 కోట్లు.