Imran Khan : పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Former PM) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఆయన జైల్లోనే మృతిచెంది ఉండొచ్చంటూ పాకిస్థాన్కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు (Senior Journalist) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ వాదనకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. అమెరికాలో ఉంటున్న జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జీవించి లేరని ముగ్గురు సీనియర్ పాకిస్థాన్ సైనిక అధికారులు తనకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వాళ్లు కూడా ఈ సమాచారాన్ని స్వయంగా నిర్ధారించలేదని చెప్పారు. అనధికారిక మార్గాల్లో తమకు సమాచారం అందిందని మాత్రమే వారు చెప్పినట్లు వివరించారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయనపై పలు కేసులు కొనసాగుతున్నాయి.
జైల్లో ఉన్న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వడం లేదంటూ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ పలుమార్లు ఆరోపించింది. ఆయనకు సరైన వైద్యం అందడం లేదని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇమ్రాన్ కుటుంబసభ్యులు, పీటీఐ నేతలు మంగళవారం మరోసారి ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్కు లాంగ్ మార్చ్ చేపడతామని పీటీఐ ప్రకటించింది.
అంతకుముందే నిరసనలు చేపడతామని పీటీఐ హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా నుంచి కూడా పాకిస్థాన్పై ఒత్తిడి పెరుగుతోంది. 13 మంది అమెరికా చట్టసభ సభ్యులు అక్కడి విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాశారు. ఇమ్రాన్ ఆయన భార్య బుష్రా బీబీ నిర్బంధ పరిస్థితులపై ఇస్లామాబాద్తో మాట్లాడాలని కోరారు.