ముంబై: ఒక కానిస్టేబుల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆ పోలీస్ చనిపోయిన 42 రోజుల తర్వాత ఆయుష్మాన్ భారత్ నుంచి సందేశం వచ్చింది. ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’ అని అందులో పేర్కొన్నారు. (Ayushman Bharat’s message) ఈ మెసేజ్ చూసి కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ దేవ్ నారాయణ్ రామ్ అనారోగ్యం వల్ల జూన్ 26న సుర్గుజాలోని అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. నాలుగు రోజులపాటు చికిత్స తర్వాత, జూన్ 30న ఆయన మరణించారు.
కాగా, కానిస్టేబుల్ నారాయణ్ మరణం తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలతో సహా అన్ని లాంఛనాలు పూర్తి చేశారు. అధికారిక మరణ ధృవీకరణ పత్రం కూడా పొందారు. అయితే కానిస్టేబుల్ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి ఆయన మొబైల్ ఫోన్కు ఒక సందేశం వచ్చింది. ‘ప్రియమైన దేవ్ నారాయణ్ రామ్, మీరు కోలుకుని ఇంటికి వెళ్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద అందించిన ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలతో మీరు సంతృప్తిగా ఉన్నారని మేం ఆశిస్తున్నాం’ అని అందులో ఉన్నది.
మరోవైపు ఈ సందేశాన్ని చూసి కానిస్టేబుల్ నారాయణ్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆయన భార్య సీమా దీనిపై ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘నా భర్త అంబికాపూర్ మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మేం ఆయనకు అంత్యక్రియలు కూడా నిర్వహించాం. 42 రోజుల తర్వాత ఆయన కోలుకుని ఇంటికి తిరిగి వస్తున్నారని మాకు సందేశాలు వస్తున్నాయి’ అని ఆమె అన్నారు. తన భర్త మరణించినప్పటికీ ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు పలు రోజుల పాటు చట్టవిరుద్ధంగా కొనసాగడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఆసుపత్రి ఉద్యోగిని అయిన తనకే ఇలాంటి సంఘటన జరిగితే, ఇక సామాన్య ప్రజలకు, పేద గిరిజన వర్గాల వారికి ఏమి జరుగవచ్చో ఊహించుకోవచ్చని సీమా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయిలో, నిష్పక్షపాత విచారణ జరుపాలని, బాధ్యులుగా తేలిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆసుపత్రి లేదా ఆయుష్మాన్ రికార్డులలో ఏవైనా అవకతవకలు, నిర్లక్ష్యం లేదా వ్యత్యాసాలు బయటపడితే వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. తద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోకుండా, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటుందని ఆమె అన్నారు.
కాగా, కానిస్టేబుల్ నారాయణ్, ఆయుష్మాన్ కార్డు పథకం కింద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు అంబికాపూర్ మెడికల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ శైలేంద్ర గుప్తా తెలిపారు. అయితే ఆయుష్మాన్ కార్డును 42 రోజుల పాటు ఉపయోగించారన్న కుటుంబ సభ్యుల ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ఈ పథకం కింద కేవలం ఆ నాలుగు రోజుల చికిత్సకు సంబంధించిన మొత్తాన్ని మాత్రమే మినహాయించారని, రోగి మరణం తర్వాత అదనంగా ఎటువంటి మొత్తాన్ని మినహాయించలేదని ఆయన చెప్పారు. అయితే రోగి రికార్డును మూసివేయడంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆలస్యం వల్ల ఇలా జరిగినట్లు వివరించారు.
अंबिकापुर। छत्तीसगढ़ के सरगुजा जिले में स्वास्थ्य व्यवस्था की लापरवाही का एक हैरान करने वाला मामला सामने आया है। मेडिकल कॉलेज अस्पताल अंबिकापुर में इलाज के दौरान जिस आरक्षक देवनारायण राम की मौत 30 जून को हो चुकी थी, उनकी मौत के 42 दिन बाद आयुष्मान भारत योजना की ओर से एक मैसेज… pic.twitter.com/DrRRY5Dvo6
— Lallu Ram (@lalluram_news) August 10, 2026