Union Budget 2026 | కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్పై మధ్యతరగతి ప్రజలు, రైతులు, యువత.. ఇలా ప్రతీ ఒక్కరూ కోటి ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో నిర్మలమ్మ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది.
ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2017 నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఈ సారి ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం పడింది. దీంతో ఆ రోజు సెలవు కావడంతో బడ్జెట్ ప్రవేశ పెడతారా..? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, దీనిపై కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
అయితే, వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్తేమీ కాదు. 2016 తొలిసారి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ను ఆదివారమే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2025లో బడ్జెట్ను నిర్మలమ్మ శనివారం ప్రవేశపెట్టారు. గతంలో ఆదివారాల్లో పార్లమెంట్ సమావేశమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో (2020), అలాగే పార్లమెంట్ తొలి సమావేశం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012, మే13వ తేదీన ఆదివారం నాడు సభ జరిగింది. ఈ లెక్కన పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరిస్తే, ఆదివారం నాడు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు.
పలు నివేదికల ప్రకారం.. గతంలో కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున సమర్పించేవారు. దీనివల్ల బడ్జెట్ ఆమోద ప్రక్రియ ఆలస్యమయ్యేది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ప్రభుత్వ ఖర్చుల కోసం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు వీలుగా పార్లమెంట్ ‘ఓట్ ఆన్ అకౌంట్’ను ఆమోదించాల్సి వచ్చేది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు శాఖాపరమైన డిమాండ్లను వివరంగా పరిశీలించిన తర్వాత, మిగిలిన సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ఆమెదించేవారు. ఇది తీవ్ర జాప్యాలకు దారితీస్తుండటంతో.. దీన్ని నివారించేందుకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మార్చి 31లోపే బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటుకు తగినంత సమయం లభిస్తుంది.
Also Read..
Bomb Threat | ముంబై వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
Spying | పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. 15 ఏండ్ల బాలుడు అరెస్ట్