న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రికార్డు స్థాయిలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు బుధవారం కిలో వెండి ఏకంగా రూ.3 లక్షలకు చేరువకాగా, బంగారం రూ.1.65 లక్షలు అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.14,300 లేదా 5 శాతం ఎగబాకి రూ.2,98,300కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.2.84 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.7,400 లేదా 4.69 శాతం బలపడి రూ.1,65,100కి చేరుకున్నది. డాలర్ బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దూసుకుపోవడం, పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మెరుగుపడటం ధరలు పుంజుకోవడానికి కారణాలని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 100 డాలర్లు ఎగబాకి 5,047 డాలర్లకు చేరుకోగా, వెండి 4.28 డాలర్లు అందుకొని 89.35 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.