సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు వ్యవస్థను శాసిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొకి, అధికారుల అండదండలతో కోట్లాది రూపాయల టెండర్లను దకించుకుంటున్నాయి. గడిచిన కొన్ని ఏండ్లుగా ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించి ఎంటమాలజీ, హెల్త్ విభాగంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ ఏజెన్సీ అక్రమాలపై ఏకంగా కమిషనర్ కర్ణన్కు గత నెల చివరి వారంలో ఫిర్యాదులు రావడం, అయినప్పటికీ హెల్త్ విభాగంలోని ఓ ముఖ్య అధికారి సదరు ఏజెన్సీని కాపాడే ప్రయత్నం చేస్తుండడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. 2015 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సదరు ఏజెన్సీ ఏదైనా టెండర్ దక్కించుకోవాలంటే సరైన ఫర్మ్ రిజిస్ట్రేషన్, పాన్కార్డు, ఇతర డాక్యుమెంట్లు సరిగా లేకుండానే కొన్ని ఏండ్లుగా టెండర్లు లభిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై కమిషనర్ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ ఎంసీలో కొత్త విధానానికి తెరలేచినట్లు కనిపిస్తున్నా, ఏళ్ల తరబడి పాత దందాయే సాగుతోంది. ఇంజనీరింగ్, ఆడిటింగ్, ఫైనాన్స్, లీగల్ సెక్షన్లలోని కొందరు అధికారులు సదరు ఏజెన్సీలకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అధికారులతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని, ఏజెన్సీలు బల్దియాలో పాతుకుపోయాయి. ఈ క్రమంలోనే టెండర్ దకించుకునేందుకు కొన్ని ఏజెన్సీలు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినా అధికారులు టెండర్ను ఖరారు చేస్తున్నారు. ఖాతాల మళ్లింపు విషయంలోనూ టెండర్ ఒక ఏజెన్సీ పేరు మీద ఉంటే, నిధుల చెల్లింపులు మాత్రం వేరే వ్యక్తిగత ఖాతాలకు మళ్లుతున్నాయి. కంపెనీ పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాల్లో తేడాలున్నా బిల్లులు పాస్ అవుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు, ఆడిటింగ్, లీగల్ ఒపీనియన్ కోరినప్పుడు కూడా తప్పుడు నివేదికలతో అధికారులను బురిడీ కొట్టిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో పనులు దకించుకున్న ఓ రెండు ప్రధాన ఏజెన్సీలు అధికారుల అండతోనే ఇదంతా చేస్తున్నాయని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.