న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్ స్టాక్ మార్కెట్ బుధవారం మరో రికార్డుస్థాయిని అందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్క్ను చేరింది. ప్రోత్సాహకర కార్పొరేట్ ఫలితాలు, ఆర్థికవ్యవస్థ ద్వారా వెల్లడవుతున్న గణాంకాలతో ఇన్వెస్టర్లు అదేపనిగా జరుపుతున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ మరో 546 పాయింట్లు పెరిగి 54,370 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. వరుసగా మూడురోజుల్లో 1,800 పాయింట్ల వరకూ పెరిగిన సెన్సెక్స్ బుధవారం ఇంట్రాడేలో 54,466 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,247 పాయింట్ల రికార్డు గరిష్టం వద్ద ముగిసింది. ఈ సూచి ఇంట్రాడేలో 16,290 పాయింట్ల వరకూ పెరిగింది.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ 4.77 శాతం ర్యాలీ జరపగా, మిగిలిన షేర్లలో అత్యధిక లాభాల్ని బ్యాంకులే ఆర్జించాయి. కొటక్బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్లు 2-3 శాతం మధ్య పెరిగాయి. మార్కెట్ సమయంలో ఫలితాల్ని వెల్లడించిన ఎస్బీఐ ఇంట్రాడేలో రూ.467 కొత్త రికార్డుస్థాయికి చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.715 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.