Maruti Suzuki | న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.3,877.8 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,623.6 కోట్ల లాభంతో పోలిస్తే 47.8 శాతం వృద్ధి చెందడం విశేషం. వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోవడం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లనే లాభాలు పెరగడానికి దోహదం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో సంస్థ రూ.36,697.5 కోట్ల విక్రయాలు జరిపింది.