విద్యానగర్, మే 28 : పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ లోటూ లేకుండా చూస్తున్నది. సన్న బియ్యంతో భోజనం, యూనిఫాం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలే కాదు స్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరు చేస్తున్నది. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ దూరంలో, ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల దూరంలో, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలనే నిబంధన ఉంది. ఒకవేళ లేకపోతే ఆయా విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం చెల్లించాలని చట్టం చెబుతున్నది. ఈ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో ఎవరైతే ఆవాస పరిధిలో పాఠశాల లేకుండా ఉండి, దూరంగా ఉన్న పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారో వారికి రవాణా భత్యం చెల్లిస్తున్నారు.
జిల్లాలో 1112 మందికి లబ్ధి..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,011 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో హ్యాబిటేషన్లకు దూరంగా 697 ప్రైమరీ పాఠశాలలు ఉండగా 65 మంది విద్యార్థులు కిలోమీటర్ కంటే దూరం ప్రయాణించి అభ్యసిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 127 ఉండగా, 491 మంది విద్యార్థులు దూరం నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. ఉన్నత పా ఠశాలలు 556 ఉండగా, 556 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1,011 పాఠశాలలో 1,112 మంది విద్యార్థులు ఈ రవాణా భత్యానికి పొందుతున్నారు. జిల్లాలో 1నుంచి 5 తరగతి వారికి నెలకు రూ.400 చొప్పున పది నెలలకు రూ.4 వేలు, 5 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున పది నెలలకు రూ.6వేలు అందజేస్తున్నారు.
నూతనంగా 9,10 తరగతి విద్యార్థులకు సాయం..
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం గత సంవత్స రం వరకు కేవలం 1 నుంచి 8 వ తరగతి వరకు మాత్రమే రవాణా భత్యాన్ని ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు రవాణా భత్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి వరకు ప్రతి పేద విద్యార్థికి చదువును చెప్పించడం బాధ్యతగా తీసుకోవాలన్న ఆశయంతో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నది. కామారెడ్డి జిల్లాలో 187 ఉన్నత పాఠశాలలో 9,10వ తరగతి చదువుతన్న విద్యార్థులు 556 మంది ఉన్నారు. వీరికి 2020-2021 విద్యా సంవత్సరానికి రవాణా భత్యాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది. 9,10 వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున 10 నెలకు రూ.6 వేలు ఇచ్చినట్లుగా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 61 ఉన్నత పాఠశాలలు, 28 ప్రాథమికోన్నత పాఠశాలలు, తొమ్మిది ప్రైమరీ పాఠశాలలు లబ్ధి పొందుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రవాణా భత్యం పొందనున్నారు.