భద్రాచలం, మే 7 : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని, కేసీఆరే సరైన నాయకుడని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ నాయకులతో కలిసి భద్రాచలం పట్టణంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మనం అధః పాతాళానికి పోయినట్లేనని, ఇప్పటికే ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం సతమతమవుతుందన్నారు. ఐదు నెలలు దాటినా వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ పార్టీ అమలుకాని వాగ్దానాలు చేసిందని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వారి విధానాలతో విసిగిపోయారన్నారు. ప్రజలంతా ఇప్పుడు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడేందుకు మహబూబాబాద్ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భద్రాచలం బీఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్లు మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని, నీళ్ల ఇవ్వడం చేతకాక లక్షలాది ఎకరాల్లో పొలాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా కారు గుర్తుకే ఓటేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్కుమార్, తాండ్ర వెంకటరమణారావు, రేపాక పూర్ణచంద్రరావు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు.