చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట), మే7: చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. మద్దూరు-ముస్త్యాల రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గాగిళ్లాపూర్లో స్తంభం విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మద్దూరు మండలంలోని పిట్టలగూడెంలో గాలివానకు రేకుల ఇండ్లు పూర్తిగా ధ్వంసంకావడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. చేర్యాల మండలంలోని వీరన్నపేటలో కమ్మకోలు రాజు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
హుస్నాబాద్, మే 7: హుస్నాబాద్ పట్టణంతో పాటు డివిజన్లోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో మామిడి తోటలకు నష్టం జరిగింది.
కొండపాక(కుకునూరుపల్లి), మే 7: ఉమ్మడి కొండపాక మండలం వ్యాప్తంగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గాలులకు చాలా చోట్ల ఫ్లెక్సీలు నెలకొరిగాయి.
కొమురవెల్లి, మే 7: కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని గురువన్నపేటలో గాలివానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
గజ్వేల్, మే 7: మండల పరిధిలోని కొడకండ్లలో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసింది. రైతులు వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని చేతుల సాయంతో ఒక దగ్గరకు చేర్చారు.
చేర్యాల, మే 7: పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.ఉదయం నుంచి నిప్పులు కురిపించిన సూర్యుడు సాయంత్రం పట్టణం మొత్తం చిమ్మచీకట్లు అలుముకున్నాయి. 25 నిమిషాల పాటు కురిసిన వర్షంతో పట్టణంలో జరిగే వారంతపు సంతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంటు సరఫరా నిలిచిపోయి ఒక్కసారిగా వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు.
బెజ్జంకి, మే 7: భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యం రాశులపై ఉన్న టార్పాలిన్లు ఎగిరిపోయాయి. వేగంగా కొనుగోలు చేయకపోవడంతోనే ధాన్యం తడిసినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాయపోల్, మే 7 : అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు ఐకేపీ అధికారును కోరుతున్నారు.
సిద్దిపేట కమాన్, మే7: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సిద్దిపేట పట్టణంలో పాటు ఆయా మండలాల్లో ధాన్యంతో పాటు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఈదురుగాలుల వల్ల అక్కడక్కడ చెట్లు విరిగి పడ్డాయి.
కొండపాక(కుకునూరుపల్లి), మే 7 : పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన సంఘటన కుకునూరుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుకునూరుపల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(36) మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావండంతో పొలం వద్ద వేపచెట్టు కింద నిలబడగా ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేటకు తరలించారు.
కొమురవెల్లి, మే 7 : మండలంలోని గురువన్నపేటలో పిడుగుపాటుకు గేదె మృతి చెంది ంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్ట కనకయ్య తన గేదెను వ్యవసాయ బావి వద్ద కట్టేశాడు. మంగళవా రం ఉరుములు మెరుపులతో గేదెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.