హైదరాబాద్, ఆగస్టు 11 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. దక్షిణాదిలో తన తొలి హౌజింగ్ ప్రాజెక్టును హైదరాబాద్లో త్వరలో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించతలపెట్టిన ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును కోకాపేట్లోని గోల్డెన్ మైల్ రోడ్డులో నిర్మించబోతున్నది. 65 అంతస్తుల రెండు టవర్లలో 450 అపార్ట్మెంట్లు, 16 పెంట్హౌస్లను 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. త్వరలో భూమి పూజ చేయనున్న ఈ లగ్జరీ ప్రాజెక్టును ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్ వర్గాలు వెల్లడించాయి.
భారత్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులను ఈ రియల్ ఎస్టేట్ సంస్థనే నిర్మిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది ప్రాజెక్టులను పుణె, ముంబై, కోల్కతా, గురుగ్రామ్ల్లో నిర్మించినట్టు ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా తెలిపారు. దక్షిణాదిలో నిర్మిస్తున్న తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఇదేనని ఆయన వెల్లడించారు. ఈ లగ్జరీ ప్రాజెక్టునకు రెరా అనుమతులు కూడా లభించాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్టు, అలాగే భూమి కోసం అదనంగా రూ.250 కోట్ల నిధులను వెచ్చించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అపార్ట్మెంట్ల విక్రయం ద్వారా రూ.3,500-4,200 కోట్ల వరకు ఆదాయం సమకూరవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికే ఎనిమిది పెంట్హౌస్లు అమ్ముడయ్యాయని, వీటి మొత్తం విలువ రూ.250 కోట్లని వెల్లడించారు. అలాగే రూ.62 కోట్ల విలువైన మరో పెంట్హౌజ్ కూడా అమ్ముడైందన్నారు.