ముంబై, ఏప్రిల్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది. ఉదయం ఆరంభం నుంచే లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు.. సమయం గడుస్తున్నకొద్దీ పెట్టుబడుల ఉపసంహరణలకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఆఖర్లో కొనుగోళ్ల వైపు కదిలినా.. భారీ నష్టాలు మాత్రం తప్పలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 1,172.19 పాయింట్లు లేదా 2.01 శాతం క్షీణించి 57,166.74 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 302 పాయింట్లు లేదా 1.73 శాతం కోల్పోయి 17,173.65 వద్ద స్థిరపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, దేశ స్థూల ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణ భయాలు, పారిశ్రామికోత్పత్తి వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ తీశాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఇక ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలకు దిగువన ఉండటం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా ఆకర్షణీయంగా లేకపోవడం ఆయా సంస్థల షేర్లను నష్టపర్చిందని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతి, టైటాన్, హెచ్యూఎల్, మహీంద్రా షేర్లు లాభపడినా మార్కెట్ను నష్టాల నుంచి గట్టెక్కించలేకపోయాయి. రంగాలవారీగా ఐటీ షేర్లు 4.76 శాతం పడిపోగా, టెక్నాలజీ, ఫైనాన్స్, టెలికం షేర్లూ నిరాశపరిచాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, జపాన్ సూచీలు నష్టపోగా, హాంకాంగ్ లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2 శాతం నష్టాలను చవిచూసింది. దీంతో బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.2.58 లక్షల కోట్లకుపైగా దిగజారింది.
ఒకానొక దశలో సెన్సెక్స్ గరిష్ఠంగా 1,496.54 పాయింట్లు లేదా 2.56 శాతం పతనమైంది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లు కనుమరుగైపోయింది. అయితే మదుపరులు తిరిగి పెట్టుబడుల వైపు కదలడంతో నష్టాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.2,58,855.59 కోట్లు తగ్గి రూ.2,69,44,207. 98 కోట్లకు తరిగిపోయింది. హెవీవెయిట్ షేర్లుగా ఉన్న ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోవడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
రూ.38,542 కోట్లు డౌన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ షేర్లు నష్టాలబారినపడ్డాయి. గతంతో చూస్తే స్టాండలోన్ నికర లాభం 23 శాతం ఎగిసి ఏకంగా రూ.10,055.20 కోట్లను తాకిన సంగతి విదితమే. అయినా బ్యాంక్ షేర్ విలువ దాదాపు 5 శాతం మేర పతనమైంది. బీఎస్ఈలో 4.74 శాతం దిగజారి రూ.1,395.35కు పరిమితమైన షేర్ విలువ.. ఎన్ఎస్ఈలో 4.60 శాతం పడిపోయి రూ.1,397.50 వద్ద నిలిచింది. ఒకానొక దశలో బీఎస్ఈలో 5.10 శాతం మేర బ్యాంక్ షేర్ విలువ క్షీణించి రూ.1,390.10 వద్దకు వెళ్లింది. అయితే చివరకు కాస్త కోలుకున్నది. ఈ క్రమంలోనే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.38,541.51 కోట్లు కరిగిపోయి రూ.7,73,797.06 కోట్ల వద్ద ఉన్నది.
రూ.53,510 కోట్లు ఫట్
దేశీయ ప్రధాన ఐటీ రంగ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేర్లు 7 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.53,510 కోట్లు హరించుకుపోయింది. ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను సంస్థ ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో నిరాశకు లోనైన మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. ఈ క్రమంలోనే బీఎస్ఈలో 7.27 శాతం పడిపోయి రూ.1,621.45 వద్దకు చేరిన ఇన్ఫీ షేర్ విలువ.. ఎన్ఎస్ఈలో 7.22 శాతం దిగజారి రూ.1,622.30 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో బీఎస్ఈలో ఏకంగా 8.95 శాతం వరకు క్షీణించి రూ.1,592.05కు చేరింది. అయితే చివరకు కోలుకున్నది. అయినప్పటికీ ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.53,509.71 కోట్లు తగ్గి రూ.6,82,101.64 కోట్లకు పరిమితమైంది.