Personal Finance | కొత్త ఏడాది అడుగుపెట్టి అప్పుడే పక్షం రోజులు గడిచిపోయాయి. నూతన సంవత్సరం వచ్చీరాగానే ఎన్నెన్నో అనుకొని ఉంటారు. ఆహారం, వ్యాయామం, నిద్ర.. ఇలా ఎన్నో విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. వాటిని పక్కాగా అమలుచేస్తున్నారా? ఆ సంగతులు ఎలా ఉన్నా.. కొత్త పెట్టుబడుల విషయంలో పట్టుదలకు పోవద్దని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. తాత్కాలిక లబ్ధి కన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
కొత్త సంవత్సరం రాగానే ఎంతోకొంత మారాలనుకుంటాం. ఎన్నో మార్చేయాలనుకుంటాం. ఖర్చులు తగ్గించాలని, పొదుపు మంత్రం పఠించాలని, ఎలాగైనా మదుపు చేయాలని బలంగా కోరుకుంటాం. అన్నీ మంచి నిర్ణయాలే! అయితే, ఆర్థిక పరమైన స్పష్టత లేకపోతే.. మదుపు అదుపు తప్పే ప్రమాదం ఉంది. తక్కువ కాల పరిమితితో పెట్టుబడి పెట్టాలనుకోవడం సరైనది కాదు. జనవరిలో ఇన్వెస్ట్ చేసి డిసెంబర్లో లాభాలు కొల్లగొడతాను అనుకుంటే అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యే పనికాదు. రైతు నారుపోయగానే దిగుబడి చేతికి రాదు కదా! నాలుగు నెలలు గడిస్తే గానీ.. పంట పండదు! పెట్టుబడుల విషయంలోనూ అంతే. ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఏడాది తిరిగేలోపు రెండింతలు, మూడింతల లాభాలు రావాలంటే అది ఉత్తమాటే! ఒక ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడులు పెట్టాలి. లాభాల కోసం నిర్దేశిత సమయం వేచి ఉండాలి.
మన అవసరాలు గుర్తెరిగి అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. పిల్లల చదువు, పెండ్లి, రిటైర్మెంట్ ప్లాన్.. ఇవన్నీ దీర్ఘకాలికమైనవి. భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఒక్క ఏడాదిలో పైన పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా లాభాలు పొందలేరు. ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే అంత పెద్ద మొత్తమూ ఏడాదిలో కరిగిపోతుంది. చిన్న మొత్తంతో పెద్ద ప్రయోజనం పొందాలంటే.. కనీసం పదేండ్ల కాల పరిమితితో ఇన్వెస్ట్ చేయాలి. ఒకట్రెండేండ్లు చాలు అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. ఆరు శాతం వడ్డీ లభిస్తుంది. డబ్బుకు రక్షణ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. పెట్టుబడి ప్రణాళిక పదేండ్లు అయితే.. మ్యూచువల్ఫండ్స్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో దాదాపు 14 శాతం రిటర్న్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకు కలిసివస్తుంది. పదేండ్లలో మంచి లాభాలను అందించే మరో మార్గం రియల్ ఎస్టేట్. ఆరేండ్లలోనే భూముల ధరలు రెండింతలు అవుతాయని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్లో సగటు రిటర్న్స్ 12 శాతంగా ఉంది.
లాభాలున్న చోట రిస్క్ ఉంటుంది. రిస్క్ వద్దంటే.. లాభ శాతం తగ్గుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఫిక్స్డ్ డిపాజిట్ను ఎంచుకోకూడదు. అందులో రిటర్న్స్ 6 శాతం మించవు. ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉన్న ఈ రోజుల్లో.. దానికన్నా తక్కువ రిటర్న్స్ వచ్చేచోట దీర్ఘకాలం మదుపు చేయడం ప్రయోజనకారి కాదు. అదే సమయంలో, పదేండ్లుగా కొనసాగుతున్న మ్యూచువల్ ఫండ్స్ను కదిలించి.. మరోచోట అదృష్టాన్ని పరీక్షించుకుంటానన్నా తప్పే! అది కోల్పోయిన వస్తువును పోగొట్టుకున్న చోట కాకుండా మరెక్కడో వెతికినట్టు అవుతుంది! 14 నుంచి 16 శాతం రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసి, 12 శాతం రిటర్న్స్ ఇచ్చే భూమిపై పెట్టడం గొప్ప ఎత్తుగడ అనిపించుకోదు. పెట్టుబడిగా కాకుండా.. ఒక స్థిరాస్తిగా భూమి గానీ, ఇల్లు గానీ కొనాలనుకుంటే పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో అర్థముంది. అంతేకానీ, ఆ భూమినీ తిరిగి అమ్మేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ను ముట్టుకోకండి. ఒకట్రెండు ఏండ్లకైతే ఎఫ్డీలో పెట్టుబడి ఉత్తమం. పదేండ్లు, అంతకుమించిన నిడివితో పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మంచిమార్గం. రిస్క్ను ఎదుర్కొనే ధైర్యం, సమయం ఉంటే.. స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎంచుకోవచ్చు. మీ శక్తిసామర్థ్యాలను బట్టి అవసరానికి అనుగుణమైన పెట్టుబడిని ఎంచుకొని ఈ ఏడాది లాభాలకు నాంది పలకండి.
ఒక స్థితిమంతుడు 1995 సంవత్సరంలో కొంత భూమిని రూ.60 వేలకు కొన్నాడు. ఇప్పుడు మార్కెట్లో దాని విలువ రూ.60 లక్షలు ఉంది. తన పెట్టుబడి వంద రెంట్లు పెరిగిందని ఆయన సంబురపడ్డాడు. అయితే అదే సంవత్సరం అతని స్నేహితుడు రూ.60 వేలు నిపోన్ ఇండియా గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అది 218 రెట్లు పెరిగి రూ.1.30 కోట్లయింది. ఈ ఇద్దరూ లాభపడ్డవారే! రెండిట్లో ఉన్న కామన్పాయింట్ ఇద్దరూ దాదాపు 27 ఏండ్లు పెట్టుబడిని ముట్టుకోలేదు. అందుకే ఇద్దరూ ఉత్తమ లాభాలే అందుకున్నారు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..