Personal finance | ‘మ్యూచువల్ ఫండ్స్ ( Mutual Funds ) పెట్టుబడులు మార్కెట్ ఒడుదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడికి ముందు అన్ని పత్రాలూ జాగ్రత్తగా చదవండి’ .. ప్రకటనల్లో ఈ పంక్తులు చీమల్లాంటి చిన్న అక్షరాల్లో కనిపిస్తాయి, జెట్స్పీడ్ వేగంతో వినిపిస్తాయి. ఎందుకు? ఎప్పుడు? అన్న స్పష్టత ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లాభాలను అందిస్తాయని నిపుణుల మాట! మార్కెట్ హెచ్చుతగ్గులు లాభ శాతాన్ని తగ్గించవచ్చు కానీ, నష్టాల్లోకి మాత్రం నెట్టేయవని నమ్మకంగా చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి స్పష్టత ఉండాలంటే…
పర్సనల్ ఫైనాన్స్ ( Personal finance ) అనగానే చాలామంది ఎక్కడ పెడితే డబ్బులు పెరుగుతాయా అనే ఆలోచిస్తారు. నెలల వ్యవధిలో లాభాల వర్షం కురవాలని ఆశిస్తుంటారు. ఇలాంటి ఆత్రుత మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పనికిరాదు. తొందరపాటు వల్ల లాభాలు రాకపోగా నష్టాలు చవిచూసే ప్రమాదమూ ఉంటుంది. సరళతరమైన పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ చక్కని మార్గం అంటారు ఆర్థిక వేత్తలు. మార్కెట్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రిస్క్ అంతటా ఉంటుంది. గడిచిన పదేండ్లుగా మ్యూచువల్ ఫండ్స్ ఏటా 14 శాతం రిటర్న్స్ సాధిస్తుండటం విశేషం.
ఏ పెట్టుబడి ఎందుకు పెడుతున్నామో తెలిస్తే.. దాని ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలం. తాత్కాలిక అవసరాలకు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ఆశించిన లాభాలు రావు. భవిష్యత్ అవసరాలు ముందుగానే ఊహించి, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలి. ఉదాహరణకు కూతురి రెండేండ్ల వయసులో మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించారనుకోండి. చిన్నారి ఇంటర్ పూర్తయ్యాక.. ఉన్నత విద్యకు అంటే 17 ఏండ్ల వయసులో రిటర్న్స్ వచ్చేలా చూసుకోవాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపికే అవుతుంది. అలాగని ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని తీయకూడదు అని భీష్మించుకోవద్దు. ఇల్లు గడవలేని స్థితి ఏర్పడినప్పుడు అధిక లాభాల గురించి ఆలోచించకుండా పెట్టుబడులు ఉపసంహరించడం విజ్ఞత అనిపించుకుంటుంది.
‘15+15+15= ఒక కోటి’ ఈ కొటేషన్ మార్కెట్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. పదిహేనేండ్లపాటు నెలకు రూ.15వేల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి, 15 శాతం రిటర్న్స్ పొందగలిగితే.. అచ్చంగా రూ.కోటి కూడబెట్టినట్టే! అంటే పదిహేనేండ్లలో రూ.27 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. కోటి వస్తాయి. రిటర్న్ శాతం కాస్త అటూఇటుగా మారితే.. కోటికి కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మార్కెట్ భారీగా క్రాష్ అయి 20 శాతం పడిపోయినా రూ.85 లక్షల వరకూ పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కాలపరిమితి పెరిగేకొద్దీ ఇన్వెస్టర్ సొమ్ముకు భద్రత పెరుగుతుంటుంది. రిస్క్ తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు ఎదురైతే లాభశాతం తగ్గుతుందే కానీ, నష్టపోయే పరిస్థితులు ఉండవు.
ఇన్వెస్టర్ ప్రధానంగా తన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అందుకు తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో దేనిని ఎంచుకోవాలో అవగాహనకు రావాలి. కొన్ని ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగేవీ ఉంటాయి. కొన్ని ఏడాదిలో సగానికి పడిపోవచ్చు. విలువ బాగా పెరిగిందని, భారీగా పడిపోయిందని తొందరపాటుతో రెండు మూడేండ్లకే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు కొందరు. దీనివల్ల ఆశించిన ప్రయోజనం చేకూరదు. ఇన్వెస్ట్ చేశాక మొదటి రెండుమూడేండ్లు పడిపోయినా పట్టించుకోవాల్సిన పన్లేదు. కనీసం ఎనిమిదేండ్లు కొనసాగిస్తే పెట్టిన పెట్టుబడికి తప్పకుండా ఎంతోకొంత గిట్టుబాటు అవుతుంది. అదృష్టం కలిసివస్తే అంచనాలకు మించిన ఆదాయం సమకూరుతుంది. చివరగా.. నిపుణుల సలహా మేరకు మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడికి ముందు అన్ని పత్రాలు జాగ్రత్తగా చదవడం మాత్రం మర్చిపోకండి.
సాఫీగా సాగుతున్న ప్రయాణం గమ్యానికి చేరడానికి ముందు అనుకోని విధంగా ఇబ్బందికరంగా మారవచ్చు. టైర్ పంక్చర్ కావడమో, ఇంధనం అయిపోవడమో, రోడ్డు మరమ్మతు జరుగుతుండటమో.. ఇలా రకరకాల సమస్యలు ఎదురవ్వొచ్చు. అంతమాత్రానికి వెనక్కి వెళ్లిపోం కదా! మ్యూచువల్ ఫండ్స్కూ ఇదే సూత్రం వర్తిస్తుంది. పదిహేనేండ్ల ప్రణాళికతో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. పన్నెండేండ్లు గడిచిపోయాయి కూడా! తర్వాత మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉంటే.. మూడేండ్ల ముందుగానే వెనక్కి తీసుకోవాలి. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడం మంచిది. కొంత మొత్తాన్ని మరోచోట ఇన్వెస్ట్ చేయొచ్చు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..