హైదరాబాద్ : రాష్ట్రంలో మాజీ సర్పంచులు చేపట్టిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదల కోసం తెలంగాణ సర్పంచుల ( Sarpanches ) సంఘం నాయకులు డీజీపీ ఆనంద్ ( DGP Anand ) కు వినతి పత్రం సమర్పించారు. తమను సీఎంను కలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో మాజీ సర్పంచులను, సర్పంచులు సీఎంను కలువకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 31 నెలలుగా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బిల్లులు ఇవ్వాలని ఏ కార్యక్రమాలు చేసినా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ముఖ్యమంత్రిని కలువకుండా అరెస్టు చేస్తున్నారని వాపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కల్పిస్తే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.