చిన్నారులకు మరింత బలవర్ధకమైన ఆహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ‘తొలి ముద్ద’ పేరుతో అల్పాహారం పెడుతామంటూ ప్రభుత్వం ప్రకటించినా.. జిల్లాలో మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. కేంద్రాలు పునఃప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా చిన్నారులు పౌష్ఠికాహారం కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 9 : నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని పిల్లలు పోషకాహార లోపంతో తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో వారిలో శారీరక ఎదుగుదల కూడా లోపిస్తున్నది. గర్భిణులకు కూడా సరైన పోషకాహారం అందక పుట్టబోయే సంతానం తక్కువ బరువు ఉండడం, చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలు వంటి వాటితో సతమతమవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రెడీ టూ కుక్ ఉప్మా, కిచిడీతో పాటు మరిన్ని పౌష్ఠికాహార రుచులు అందిస్తామంటూ కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని 777 కేంద్రాల్లో గల 9 వేలకు పైగా చిన్నారులు కేంద్రాలకు వస్తుండగా, వారికి అల్పాహారం అందుతుందని భావించారు. అయితే, ఈ ప్రకటన జిల్లాలో మాత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా, ఒంటిపూట భోజనం, స్నాక్స్తోనే పరిపెడుతున్నట్లు తెలుస్తున్నది. ఉదయంపూట ప్రారంభిస్తామన్న ఈ పథకం కొన్ని జిల్లాల్లో మాత్రమే మొదలైంది. మిగతా జిల్లాల్లో మాత్రం అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
చాలామంది ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు ఉండడం లేదని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చేపడుతున్న తనిఖీల్లో తేలుతుండగా, జిల్లాలో చిన్నారుల పోషకాహార పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలతో ముడిపడి ఉన్న ఈ పథకాన్ని ఆలస్యం చేయడం సమంజసం కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. పథకం అమలుకు అవసరమైన నిధులు, ఆహారపదార్థాల సరఫరా, మార్గదర్శకాలు వెంటనే విడుదల చేసి అందించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వెంటనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతిని వివరణ అడుగగా.. తొలిముద్ద పథకం ఇప్పటివరకు మూడు జిల్లాల్లో ప్రారంభమైందని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే జిల్లాలో అమలు చేస్తామన్నారు.