న్యూఢిల్లీ : ప్రైవేట్ యూనివర్సిటీలను లాభం కోసం నిర్వహించకూడదని సుప్రీం కోర్టు గురువారం తెలిపింది. ప్రజల విద్యా లక్ష్యాలను పూర్తి చేసే ఉద్దేశం వాటికి ఉండాలని పేర్కొంది. కేవలం లాభాలు సంపాదించుకొనే వ్యాపారంలా విద్యను చూసే సంస్థలను అనుమతించొద్దని ప్రభుత్వాలను కోరింది.
అన్ని విశ్వవిద్యాలయాల ఆడిట్ చేసిన ఖాతాలను ఆరు వారాల్లోగా తమకు సమర్పించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆ ఖాతాల్లో మిగులు ఆదాయం, వ్యయం, వసూలు చేసిన రుసుముల వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. అమిటీ యూనివర్సిటీ కాలేజీ రికార్డుల్లో తన పేరు మార్చుకోవాలని ప్రయత్నించిన ఓ విద్యార్థిని తనను యాజమాన్యం వేధించిందని దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.