న్యూఢిల్లీ : పిల్లల పాస్పోర్ట్ల చెల్లుబాటుకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. 15 ఏండ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఇకపై జారీ తేదీ నుంచి ఐదేండ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే ఐదేండ్లు పూర్తికాకముందే పిల్లలకు 18 ఏండ్లు వస్తే వారి 18వ పుట్టినరోజు వరకు మాత్రమే పాస్పోర్ట్ చెల్లుతుంది. అంటే ఐదేండ్లు లేదా 18 ఏండ్లు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు మాత్రమే పాస్పోర్ట్ చెల్లుతుంది.
పాస్పోర్ట్ నిబంధనలు-1980కు సవరణలు చేస్తూ, విదేశీ వ్యవహారాల శాఖ పాస్పోర్ట్(సవరణ) నిబంధనలు-2026ను రూపొందించింది. గతంలో 15 ఏండ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఐదేండ్లు లేదా పిల్లలకు 15 ఏండ్ల వచ్చే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు మాత్రమే చెల్లుబాటులో ఉండేది. తాజా నిబంధనలతో 12 నుంచి 14 ఏండ్ల మధ్య పాస్పోర్ట్ పొందే పిల్లలకు ప్రయోజనం కలుగనుంది. వారు 18 ఏండ్ల వరకు పాస్పోర్ట్ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.