నిర్మల్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి 17న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించింది. టీ స్టాల్, కిరాణం, పిండిగిర్ని, రిపేరింగ్ దుకాణాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్లు, ఫొటో గ్రాఫిక్ స్టూడియోలు, ఆటో రిక్షాలు, చిన్న కుటీర పరిశ్రమలు ఇలా దాదాపు 170 రకాల స్వయం ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకు రూ.లక్ష యూనిట్కు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల యూనిట్కు 70 శాతం సబ్సిడీ, రూ.3 లక్షల యూనిట్కు 60 శాతం సబ్సిడీ ప్రకటించింది. నిర్మల్ జిల్లాకు 10,989 యూనిట్లు అందజేస్తామని ప్రకటించింది. 35,177 మంది నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,350 మంది ఎస్సీలు, 3,627 మంది ఎస్టీలు, 17,286 మంది బీసీలు, 923 మంది ఈబీసీలు, 5,926 మంది ముస్లీం మైనారిటీలు, 65 మంది క్రిస్టియన్లు ఉన్నారు. ఈ పథకం అమలుకు నోచుకోకపోవడంతో దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు.
స్పష్టత కరువు
గతేడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.50 వేలు, రూ. లక్ష లోపు రుణాలు మంజూరు చేసి ఆర్థిక సాయం ఉత్తర్వులను అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా రాజీవ్ యువ వికాసం లక్ష్యాలు పూర్తి చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకముందే.. ఈ పథకం అమలును నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎంపిక ప్రక్రియ కూడా అర్ధాంతరంగా నిలిచింది. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉండడం, అందరికీ ఆర్థిక సాయం అందించడం సాధ్యం కాదన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు.
ఉపాధి లేకుండైంది..
2022 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల వికాస్ స్కీమ్లో భాగంగా యవతులకు వారికి ఇష్టమైన రంగాల్లో స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ ఇచ్చారు. అప్పట్లో మా గ్రామంలో నెల రోజులపాటు ఇచ్చిన ట్రైనింగ్లో పాల్గొని కుట్లు, అల్లికలు, డిజైనింగ్, మగ్గం వర్క్ నేర్చుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంబ్రాయిడరీ మిషనరీ యూనిట్ కోసం రూ.3 లక్షల రుణం ఇస్తామంటే ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న. నేటికీ ఎదురుచూపులే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పథకాన్ని నిలిపివేశారని తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు చిన్న పిల్లలతో ఎలాంటి ఉపాధి లేక ఇంటికే పరిమితమవుతున్నం. మాలాంటి పేదలకు ఉపాధి ఆశచూపి మోసం చేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు.
– అనూష, ముజ్గి, నిర్మల్ మండలం
లైట్హౌస్ కోసం దరఖాస్తు చేసుకున్నా..
రాజీవ్ యువ వికాసం పథకం కింద డెకోరేషన్ యూనిట్ కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న. మా సొంత గ్రామం లో లైట్హౌజ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకొని, శుభకా ర్యాలకు డెకొరేషన్ చేసి స్వ యం ఉపాధి పొందుదామని ఆశించా. పథకం కోసం దరఖాస్తు చేసి 17 నెలలు గడుస్తున్నా దాని గురించి ఎవరేమీ చెప్పడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల ను వెళ్లి అడిగితే.. పథకాన్ని అమలు చేయాలనే గైడ్లైన్స్ రాలేదంటున్నారు. ప్రభుత్వం చెప్పినప్పుడు సమాచా రం ఇస్తామంటున్నారు. ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి ఇక అది రాదని ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తున్నా.
– అర్ల శ్యాంసుందర్, ముజ్గి, నిర్మల్ మండలం
