కట్టంగూర్, జూన్ 12 : కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి చెందిన రైతు తేలు రవి జీవనాధారంగా భావించిన రెండు బర్రెలు, ఒక దూడ శుక్రవారం విద్యుత్ తీగల కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, గాలివానకు గ్రామ శివారులోని ఓ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ తీగలు నేలపై పడ్డాయి. అయితే వాటిని అధికారులు గుర్తించి తొలగించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రైతు రవి తన బర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలాల వైపు తీసుకెళ్తుండగా, పచ్చిక కోసం ముందుకు వెళ్లిన గేదెలు నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలను తాకాయి. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహానికి గురైన రెండు బర్రెలు, ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. కళ్లముందే మూగ జీవాలు ప్రాణాలు కోల్పోవడం చూసి రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతిచెందిన పశువుల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.