మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక ( Illegal sand ) జోరుగా రవాణా జరుగుతుంది. ఇసుక రవాణాకు అనుమతులు లేకుండానే బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని మందిపల్లి వాగు- చిట్యాల మధ్యలో సుమారు రూ. 22 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అయితే బ్రిడ్జి ( Bridge ) నిర్మాణానికి అక్రమంగా ఇసుక డంపులు చేపట్టి వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోట్ల నిర్మాణంతో చేపట్టే పనులకు ఇసుకను కొనుగోలు చేయకుండా అక్రమంగా డంపు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయలు గండి కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా ఇసుక డంపులను సీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో మాగనూరు తహసీల్దార్ మహమ్మద్ రహిమాన్కు వివరణ కోరగా బ్రిడ్జి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక కోసం కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు.