ముంబై: ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఐపీవోల జాతర సాగుతున్నది. వచ్చే దీపావళికి దేశంలోనే అతిపెద్ద ఐపీవో ఇన్వెస్టర్లకు కనువిందు చేయనున్నది. ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ.. పేటీఎం.. ఐపీవో ( Paytm IPO ) ద్వారా భారీగా రూ. 16,600 కోట్ల నిధులను సేకరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. దీపావళి సందర్భంగా ప్రారంభమయ్యే పేటీఎం ఐపీవో.. దేశంలోనే అతిపెద్దది కానున్నది. ఇంతకుముందు కోల్ ఇండియా 2010లో రూ.15,200 కోట్లు సేకరించింది.
పేటీఎంలో మదుపర్ల పెట్టుబడులు, ఖాతాదారులపై ఉల్లంఘనలు, నేరపూరిత అభియోగాలు ఉన్నాయని తెలుస్తున్నది. దీనిపై ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ దర్యాప్తు చేపట్టాయి. హవాలా లావాదేవీలు, టెర్రర్ ఫండింగ్కు పేటీఎంను వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ అభియోగాలేమిటో ఓ లుకేద్దామా..!
పేటీఎంలో వ్యక్తులుగా పెట్టుబడులు పెట్టిన వారు పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ .. సెబీ.. పరిశీలనలో తేలింది. పేటీఎం మనీలో మనీ పొదుపు చేసిన వారు, ఇన్వెస్ట్ చేసిన వారు సమర్పించిన కేవైసీ పత్రాల్లో పలు ఉల్లంఘనలు జరిగాయని సమాచారం.
దీనిపై పేటీఎంను సెబీ రాతపూర్వకంగా హెచ్చరించింది. అంతే కాదు.. మార్చిలో కొన్ని నెలల పాటు సంస్థ అడ్వైజరీ బిజినెస్ను సస్పెండ్ చేసింది. అడ్వైజరీ బిజినెస్పై సెబీ నూతన గైడ్లైన్స్ జారీ చేసింది.
మరోవైపు పేటీఎంలో లావాదేవీలు, పెట్టుబడులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దర్యాప్తు కొనసాగుతున్నదని సమాచారం. విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) కింద దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్నది.
ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మార్గదర్శకాలకు అనుగుణంగా లావాదేవీల నిర్వహణపై పేటీఎంకు ఆర్బీఐ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హవాలా లావాదేవీలు, టెర్రర్ ఫండింగ్కు పేటీఎంకు వాడుకుంటున్నట్లు ఆర్బీఐ అనుమానించింది.
ఇది నిజమని తేలితే న్యూ అంబ్రెల్లా ఎంటిటీ (ఎన్యూఈ) కింద పేటీఎం నిధుల సేకరణకు భవిష్యత్లో కష్టమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఐపీవోకు వెళ్లేందుకు రూపొందించిన ప్రతిపాదనల ముసాయిదాను ఇప్పటికే సెబీకి పేటీఎం సమర్పించిందని సమాచారం. నూతన షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.8,300 కోట్ల నిధులు సేకరించాలని పేటీఎం లక్ష్యం.
పేటీఎంలో పెట్టుబడులు పెట్టిన చైనా యాంట్ గ్రూప్ తన వాటాలను విక్రయించనున్నది. ఇందులో యాంట్ గ్రూప్కు 30 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీవోకు ముందే ఈ వాటాల విక్రయం ద్వారా పేటీఎం రూ.2000 కోట్ల నిధుల నిధుల సేకరణకు ప్రణాళిక వేసింది.
సెబీ అనుమతి లభించిన తర్వాత మార్కెట్లో పేటీఎం ఐపీవో ఎప్పుడు ఎంటరవుతుందన్న విషయం, ఐపీవోలో పేటీఎం షేర్ విలువ ఖరారు కానున్నాయి. దీపావళి నాటికి ఇది మార్కెట్లను తాకుతుందని భావిస్తున్నారు.
ఐపీవో తర్వాత పేటీఎం మార్కెట్ విలువ రూ.1.80 లక్షల కోట్ల నుంచి రూ.2.20 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.1.18 లక్షల కోట్లు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ విలువ గల స్టార్టప్ కంపెనీల్లో రెండోది ఇది.
పేటీఎం ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం నష్టాల్లోనే కొనసాగుతున్నది. సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ ఐపీవోలో తమ సంస్థ లాభాలు ఇస్తుందని హామీ ఇవ్వలేదు. ఇక ముందూ నష్టాలే వస్తాయని చెబుతున్నది. గత మూడేండ్లుగా నికర లాభాలే చూపుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,943 కోట్లు, 2020-21లో రూ.1,704 కోట్ల నష్టాలు వచ్చాయి.
పేటీఎం ఐపీవోలో రిటైల్ మదుపర్ల వాటా కేవలం 10శాతమే. క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) వాటా 75 శాతం, సంపన్న వ్యక్తుల (హెచ్ఎన్ఐ) వాటా 15 శాతం ఉండనున్నట్లు తెలుస్తున్నది. క్యూఐబీలో యాంకర్ ఇన్వెస్టర్లు 60 శాతం ఉండొచ్చు.
దేశీయ స్టార్టప్ కంపెనీ అయినా.. ఇప్పటికైతే పేటీఎం విదేశీ సంస్థలాగే పని చేస్తున్నది. తమ సంస్థ నియంత్రణాధికారాలు విదేశీ కంపెనీ పరిధిలోనే ఉన్నాయని తెలిపింది. ఇక ముందూ అలాగే కొనసాగుతుందని కూడా పేర్కొంది. ఎఫ్డీఐ నిబంధనలకు అనుగుణంగానే పేటీఎంలో విదేశీ సంస్థ నిధులు ఉన్నాయి.
పేటీఎంలో వాటాలు కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, వారెన్ బఫెట్ తమ షేర్లను విక్రయిస్తారని తెలుస్తున్నది. రతన్ టాటాకు పేటీఎంలో 75 వేల షేర్లు ఉన్నాయి. ఆర్ఎన్టీ అసోసియేట్స్ ద్వారా రతన్ టాటా ఈ షేర్లు కొనుగోలు చేశారు. వీటిలో కొన్ని వాటాలను విక్రయించనున్నట్లు సమాచారం.
హాత్వే హోల్డింగ్ అధినేత వారెన్ బఫెట్ కూడా 1.7 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. ఆయన తన హాత్వే కంపెనీ ద్వారా ఈ వాటాలను కొనుగోలు చేశారు. వీటిలో కొన్ని వాటాలను విక్రయించనున్నట్లు వినికిడి.
పేటీఎంలో ప్రధానంగా ఐదు సంస్థలకు వాటాలు ఉన్నాయి. చైనా ఆలీబాబా అనుబంధ యాంట్ గ్రూప్ 30.33 శాతం, జపాన్ సాఫ్ట్ బ్యాంక్ 18.73 శాతం, ఎలివేషన్ క్యాపిటల్ 17.65 శాతం వాటాలు ఉన్నాయి. ఇంకా చైనా ఈ-కామర్స్ మేజర్ ఆలీబాబా 7.3 %, విజయ్ శేఖర్ శర్మ 14.97 %, ఇతరులు 11 శాతం వాటాలు కలిగి ఉన్నారు.
పేటీఎంతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కూడా ఐపీవో ద్వారా దాదాపు రూ.90 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నది. ఈ రికార్డులను ఇప్పట్లో పారిశ్రామిక, బీమా, ఆర్థిక సంస్థలు బ్రేక్ చేయడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కనుక అతిపెద్ద ఐపీవోగా.. పేటీఎం ఆఫర్ ఎంతోకాలం నిలిచే అవకాశాల్లేవు.
ఇక పవర్ బ్యాంక్తో పనిలేదు.. చేతివేళ్లతోనే ఫోన్ చార్జింగ్ చేయొచ్చు !
కరీంనగర్.. ఆస్తి కోసం అన్నదమ్ముళ్ల కాల్పుల డ్రామా
యూరోప్లో వరదలు.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
కరీంనగర్.. ఆస్తి కోసం అన్నదమ్ముళ్ల కాల్పుల డ్రామా
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ.. ఈ సారి ఏ రూపమంటే.?
సెప్టెంబర్ 10 నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాలు
మాస్టర్ కార్డ్పై నిషేధం.. 5 బ్యాంకులపై ఎఫెక్ట్!