Data Center | హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు డాటా సెంటర్లు ఉండగా.. గచ్చిబౌలీలో నెలకొల్పుతున్న మూడో సెంటర్ వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నది. 1.34 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ 13 మెగావాట్ల ఐటీ లోడ్ కెపాసిటీతో సంస్థ నెలకొల్పుతున్నది. కృత్రిమ మేధస్సుతో అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ డాటా సెంటర్ను భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్ చేసింది.
వ్యాపార విస్తరణ కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ డాటా సెంటర్ను నెలకొల్పుతున్నట్లు కంట్రోల్ఎస్ ఫౌండర్, సీఈవో శ్రీధర్ తెలిపారు. డాటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారుతున్నదని, ఇక్కడే పెద్ద సంఖ్యలో కార్పొరేట్ సంస్థలు, క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు ఉండటం ఇందుకు కారణమన్నారు. ఇప్పటికే హైటెక్ సిటీ, గచ్చిబౌలీలో రెండు డాటా సెంటర్లను నిర్వహిస్తున్నది. వీటితోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా, హైదరాబాద్లో ఉన్న డాటా సెంటర్ల సామర్థ్యం 250 మెగావాట్లు.