న్యూఢిల్లీ : మాస్టర్ కార్డ్పై ఆర్బీఐ నిషేధం విధించడంతో దీని ప్రభావం యస్ బ్యాంక్ సహా మరో ఐదు ప్రైవేట్ బ్యాంకులపై అధికంగా ఉండే అవకాశం ఉంది. స్ధానికంగా డేటా నిల్వ చేయాలనే నిబంధనలను పాటించలేదనే కారణంతో ఈనెల 22 నుంచి కొత్తగా కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీ-పెయిడ్) జారీ చేయరాదని మాస్టర్కార్డ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధించింది. ఈ మార్పుల మూలంగా ప్రధానంగా ఆర్బీఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్లపై ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుందని నోమురా రీసెర్చి నివేదిక వెల్లడించింది.
ఈ సంస్ధలు జారీ చేసే అన్ని క్రెడిట్ కార్డు స్కీములు మాస్టర్ కార్డ్ కింద ఆఫర్ చేస్తుండటంతో ఈ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలపై ఆర్బీఐ నిర్ణయం ప్రభావం పడనుంది. మరోవైపు నిషేధిత మాస్టర్కార్డ్తో భాగస్వామ్యంతో 35 నుంచి 40 శాతం క్రెడిట్ కార్డు స్కీములు నిర్వహిస్తున్న ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లూ అధికంగా ప్రభావితం కానున్నాయి. తాజా పరిణామాలతో ఈ బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఇక ఎస్బీఐ మాస్టర్కార్డ్ కింద కేవలం పది శాతం స్కీమ్లనే ఆఫర్ చేస్తుండటంతో దానిపై ప్రభావం పరిమితంగా ఉండనుంది. ఆర్బీఐ గతంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ , డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లపైనా ఆర్బీఐ ఇదే తరహాలో నిషేధం విధించింది.
దేశీ రూపే కార్డుకు ఆదరణ
మాస్టర్కార్డ్పై నిషేధం విధించడంతో ఈ పరిణామం దేశీయ ‘రూపే’ కార్డుకు ఆదరణ పెంచవచ్చని భావిస్తున్నారు. మాస్టర్కార్డ్ సేవలను వినియోగించుకుంటున్న ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇప్పుడు రూపే, వీసా వంటి ఇతర పేమెంట్ గేట్వే సంస్థలను ఇవి ఆశ్రయించాల్సి రావడంతో దేశీ రూపే కార్డుకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. మాస్టర్కార్డ్పై వేటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో-బ్రాండెడ్ కార్డులు జారీ చేసే సంస్థలు రూపే, వీసాల వైపు మొగ్గుచూపవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశీ పేమెంట్ గేట్వే రూపే సేవలనే వినియోగించుకుంటున్న క్రమంలో తాజా పరిణామాలు రూపే కార్డుకు ఆదరణ పెంచేలా ఉన్నాయని భావిస్తున్నారు. చెల్లింపులు, లావాదేవీల మార్కెట్లో 30 శాతం వాటా కలిగిఉన్న రూపే కార్డు తాజా పరిణామాలతో తన మార్కెట్ మరింత పెంచుకోవచ్చనే అంచనాలు వెల్లడవుతున్నాయి.
లక్ష కార్డుల జారీపై ప్రభావం..ఆర్బీఎల్
తాజాగా మాస్టర్ కార్డుపై ఆర్బీఐ నిషేధం విధించడంతో నూతనంగా లక్ష క్రెడిట్ కార్డులను జారీ చేయడంపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రత్యామ్నాయంగా మరో పేమెంట్ గేట్వే సంస్థ ‘వీసా’తో చర్చలు జరుపుతున్నట్లు ఆర్బీఎల్ తెలిపింది. దీనికి 8 నుంచి10 వారాల సమయం పడుతుందని పేర్కొంది.
ఇతర పేమెంట్ గేట్వేల్లో మార్పిడికి కసరత్తు : యస్ బ్యాంక్
మరో ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ నూతన కార్డుల జారీ విషయమై స్పందించింది. ఇతర ప్లాట్ఫామ్ల్లోకి ఈ కార్డులను సీమ్లెస్ ట్రాన్షిషన్కు అనుమతించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యెస్ బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎస్బీఐ కార్డు వాడకందారులపై ప్రతికూల ప్రభావం పెద్దగా ఉండబోదని ప్రభుత్వరంగ ఎస్బీఐ వెల్లడించింది.