పదేండ్ల మోదీ సర్కార్ పాలనను చూస్తే.. దయనీయమైన మన దేశ ప్రస్థానం కండ్ల ముందే సాక్షాత్కరిస్తుంది. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్’, ‘అమృతకాలం’ వంటి మోదీ గ్యారెంటీల బూటకపు నినాదాల వాస్తవాలు మనకు కనిపిస్తాయి. మోదీ పాలనలో భారతీయ ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, ఉపాధి, వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. బీజేపీ సర్కార్ అవలంబించిన నయా ఉదారవాద విధానాలు దేశాన్ని తీవ్రమైన సామాజిక, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
PM Modi | దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమటించే సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. ఆకలి సూచీలో 125 దేశాల్లో మన దేశం 111వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. అయితే దేశంలో ఉన్న అనేక ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా ప్రజలను మతం మత్తులో ముంచుతున్నది బీజేపీ. రాష్ర్టాల హక్కులను హరించివేస్తున్నది. సమాఖ్యవాదానికి తిలోదకాలు ఇచ్చింది. ఏకస్వామ్య విధానానికి బాటలు వేస్తున్నది. వ్యవస్థలను మారుస్తూ నియంతృత్వ పోకడలను కొనసాగిస్తున్నది. కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యానికి బదులు అసమానతల కుల వ్యవస్థ స్థిరీకరణకు పూనుకుంటున్నది.
పదేండ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం మరింతగా పెరిగింది. సంపన్నుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. మోదీ మిత్రులు అంబానీ, అదానీ ప్రపంచ కుబేరులుగా మారిపోయారు. 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. కార్పొరేట్ సంస్థల ఎదుగుదలకు తోడ్పడ్డారు. ప్రతిఫలంగా మోదీ రుణం తీర్చుకోవడానికి గుజరాతీ కార్పొరేట్ సంస్థలు ఆయనను ప్రధానిని చేయటంలో సహకరించాయి. అందుకే ప్రజల సొమ్ముతో నిర్మించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్క కలం పోటుతో ప్రైవేట్ కంపెనీలకు బీజేపీ సర్కార్ అప్పగించేసింది.
బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిలో అత్యధికులు గుజరాతీ వ్యాపారులే. వారు దోచుకున్నదంతా ప్రజాధనమే. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారిని ఎక్కడున్నా పట్టుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ ఈ పదేండ్లలో ఏం సాధించారో అందరికీ తెలుసు. పైగా బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చి వారి రుణాలను మాఫీ చేశారు. గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు చెల్లించాల్సిన రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదంతా ప్రజల సొమ్ము కాదా?
అంతే కాదు, గత పదేండ్లలో కార్పొరేట్ సంస్థలకు రూ.55 లక్షల కోట్ల పన్ను రాయితీలను కూడా ప్రభుత్వం ఇచ్చింది. తాజా బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలపై పన్నును 33 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి ఆర్థిక విధానాలను సమర్థించే కొందరు కుహనా మేధావులు.. సంక్షేమ కార్యక్రమాలను తప్పుబడుతుండటం విడ్డూరం.దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. కానీ, మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ.410 ఉండగా.. ప్రస్తుతం రూ.906 చేరింది. నిజానికి సిలిండర్ ధరలు రూ.1200ను తాకాయి. ఎన్నికల సమయం కావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎన్నికల తర్వాత వడ్డీతో సహా మరోసారి ధరాఘాతం తప్పదు.
ప్రధాని నోటి నుంచి వెలువడే ప్రతి మాట విలువైనది. కానీ, మన ప్రధాని గత పదేండ్లలో మాట్లాడినన్ని అబద్ధాలు మరో దేశాధినేత మాట్లాడి ఉండరు. తాజాగా రాజస్థాన్లో ఎన్నికల ర్యాలీలో.. ‘కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తుంది. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలదు’ అంటూ ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం తగునా?
మనం వేసే ఓటే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలి. కులం, మతం, జాతి అనే అభిమాన, దురాభిమానాలకు, తాత్కాలిక రాయితీలు, ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఓట్ల కోసం చెప్పే మాటలు, వాగ్దానాల ఒరవడిలో కొట్టుకుపోవద్దు. నాయకులు, పార్టీల గత చరిత్ర, హామీల అమలును తెలుసుకొని ఓటు వేయండి. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా.
-డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496