Paddy Procurement | మంచిర్యాల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ పెచ్చుమీరిపోతున్నది. నిన్న మొన్నటివరకు 40 కిలోల వడ్ల బస్తాకు 41 కిలోల నుంచి 42 కిలోలు వరకు జోకారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో దోపిడీ తీరు మారింది. మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం బస్తాకు బస్తా వెయిట్ మాత్రమే వేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెళ్లాక అక్కడ లారీ లోడ్కు 8 బస్తాల నుంచి 10 బస్తాలు అంటే 320 కిలోల నుంచి 400 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రంలో రైతులు వేసిన బస్తాలకు మిల్లులు ట్రక్ షీట్లో ఇచ్చే బస్తాలకు తేడా ఉంటుంది. ఉదాహరణకు కొనుగోలు కేంద్రంలో నలుగురు రైతులు 500 బస్తాలు విక్రయిస్తే, మిల్లులు ఇచ్చే ట్రక్ షీట్లో 492 బస్తాల నుంచి 490 బస్తాలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క రైతుకు సగటున రెండు నుంచి రెండున్నర బస్తాలు తక్కువ పడుతున్నాయి. ఇలా ప్రతి రైతుకు కొంత ధాన్యం కట్ చేయాల్సి వస్తున్నది. దీనిపై మిల్లర్లను సంప్రదిస్తే కొనుగోలు కేంద్రంలో జోకిన సంచి మిల్లులకు వచ్చేసరికి బరువు తగ్గుతుందని పేర్కొంటున్నారు. లారీ అన్లోడ్ కాక మిల్లు దగ్గర రెండు, మూడు రోజులు ఉండాల్సి వస్తున్నది. దీని వల్ల ఎండకు వడ్ల బరువు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు తగ్గుతుందని మిల్లరు చెబుతున్నారు. అలా చూసుకున్నా బస్తా బరువు 750 గ్రాములు అదనంగా జోకుతున్నారు. అలాంటప్పుడు బస్తాలకు బస్తాలు బరువు ఎందుకు తీస్తున్నారన్నది అర్థం కావడం లేదు.
కేంద్రాల నిర్వాహకులపై భారం
జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ గందరగోళంగా ఉన్నది. మంచిర్యాల నియోజకవర్గంలో డీసీఎంఎస్, పీఏసీఎస్ కేంద్రాల స్థానంలో ఐకేపీలకు సెంటర్లు ఇచ్చారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో సెంటర్ల ఇన్చార్జిలను మార్చారు. కొత్తగా వచ్చిన నిర్వాహకుల వద్ద మాయిశ్చర్ మిషన్లు, కాంటాలు, ట్యాబ్లు లేవు. వాస్తవానికి ఇవన్నీ మార్కెటింగ్ శాఖ సరఫరా చేయాలి. కానీ గతంలో అందజేసిన దృష్ట్యా కొత్తవి ఇవ్వలేదు. పాత నిర్వాహకులు తిరిగి ఇవ్వకపోవడం, మిషన్లు పాడైపోవడంతో కొత్తగా కొనాల్సిన పరిస్థితి. మాయిశ్చర్ మిషన్కు రూ.5,500, కాంటాకు రూ.10 వేలు, ట్యాబ్కు రూ.20 వేలు వరకు ఖర్చు అవుతున్నాయి. మొత్తంగా రూ.35 వేల నుంచి రూ.40 వేలు సొంతంగా పెట్టుకోవాల్సి వచ్చిందని కొత్తగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ఇన్చార్జిలు వాపోతున్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో జోకిన రైతుల బస్తాలను మిల్లర్లు తగ్గిస్తున్నారు. దీంతో రైతులకు సమాధానం చెప్పుకోలేక ఇన్చార్జిలు లబోదిబోమంటున్నారు.
మిల్లర్లతో పరేషాన్ అవుతున్నది
కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టి మిల్లులకు తీసుకువెళ్తే రోజుల తరబడి కాంటా వేయడం లేదు. చివరకు ఎండలకు బరువు తగ్గిందని చెప్పి లారీలోడ్లో బస్తాలు కట్ చేస్తున్నారు. నాది మొన్నొక లారీ తీసుకెళ్తే 10 బస్తాలు కటింగ్ పెడతామన్నరు. ఆ లోడ్లో 840 బ్యాగులు పంపిన. కటింగ్ అని చెప్పగానే ధాన్యం అమ్మిన 8 మంది రైతులను కూడా మిల్లు కాడికి తీసుకుపోయిన. పది బస్తాలు కట్ చేస్తా అన్నోళ్లు చివరికి 8 బస్తాలు కట్ చేశారు. ఏ రైతు ధాన్యంలో తేడా ఉందో వారికే కట్ చేయమన్నాం. లోడ్ మొత్తానికి కోత పెట్టడంతో ఒక్కో రైతు కనీసం బస్తా నష్టపోవాల్సి వచ్చింది.
– పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు.