భద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ మధ్యాహ్ననికి భద్రాచలం వద్ద నీటిమట్టం 46.9 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఇక్కడ నీటిమట్టం 26.5 అడుగుల నమోదవగా రికార్డుస్థాయిలో 24 గంటల వ్యవధిలో 20 అడుగుల మేరపైగా నీటిమట్టం పెరిగింది. నది పరవళ్లు తొక్కుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరద ఉధృతి ఇలాగే కొనసాగితే నీటిమట్టం 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి చాలామందిని వీటిలోకి తరలించారు. ఇటు పోలవరం వద్ద కూడా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 29.755 అడుగులకు చేరింది. స్పిల్వే నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు వెళ్తున్నది.