రైల్వే బ్రిడ్జి మీదుగా దాటించి పీహెచ్సీకి తరలించిన వైద్య సిబ్బంది
అశ్వాపురం, జూలై 23: వాగు ప్రవాహం కారణంగా భద్రాద్రి జిల్లాలో మరో గర్భిణి కూడా ఇబ్బందులు పడిన ఘటన శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో గురువారం ఓ నిండు గర్భిణి ఇలాగే అవస్థలు పడుతూ వాగు దాటిన విషయం విదితమే. శుక్రవారం అశ్వాపురం మండలంలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం – అశ్వాపురం మధ్యనున్న ఇసుకవాగు పొంగి ప్రవహిస్తోంది. ఆసుపత్రికి వెళ్లే మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జి మీద నుంచి దాటి అవతలి ఒడ్డుకి చేరుకున్నది. గొందిగూడెం గ్రామానికి చెందిన కురసం లక్ష్మి 8 నెలల గర్భిణి. వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆమెను పీహెచ్సీకి తీసుకెళ్లేందుకు వైద్యాధికారులు శుక్రవారం 102 వాహనాన్ని తీసుకొచ్చారు. గొందిగూడెం ఇసుకవాగు ఉధృత ప్రవాహంతో ఆ వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో పక్కనే ఇసుకవాగుపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి పైనుంచి ఆమెను నడిపించి వాగు దాటించారు. తరువాత 102 వాహనం ద్వారా పీహెచ్సీకి తీసుకెళ్లారు.
గర్భిణుల ఆరోగ్యంపై ఆరా
లక్ష్మీదేవిపల్లి, జూలై 23: మండల పరిధిలోని చింతపెంటగూడేనికి చెందిన ఓ నిండు గర్భిణి గురువారం ఉదయం వైద్యం కోసం పాల్వంచకు వెళ్లి సాయంత్రం తిరిగి భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్లడానికి పారేటి వాగు దాటిన సంగతి విదితమే. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కలెక్టర్ అనుదీప్ వెంటనే స్పందించారు. గర్భిణి ఏ కారణాలతో వాగు దాటాల్సి వచ్చింది? గ్రామంలో ఇంకా ఎంతమంది గర్భిణులు ఉన్నారు? అనే అంశాలను పరిశీలించేందుకు శుక్రవారం అధికారుల బృందాన్ని గ్రామానికి పంపించారు. అధికారులు వాగు దాటుకుంటూ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. గర్భిణులకు వైద్యంపై సలహాలిచ్చారు.